గీసుగొండ, సెప్టెంబర్ 12 : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం మండలంలోని కోనాయిమాకుల మరియపురం, గంగదేవిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, సభ్యుల కుటీర పరిశ్రమలను పరిశీలించారు. కోనాయిమాకులలో భాగ్యలక్ష్మి స్వయం సహాయక సంఘం, ఝూన్సీ గ్రామైక్య సంఘం సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల పనితీరు, గ్రామైక్య సంఘం విధులు, బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, లీంకేజీ రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో ఏర్పాటు చేసుకున్న కుటీర పరిశ్రమను పరిశీలించారు. గ్రామైక్య సంఘం సభ్యులు ప్రతినెలాపేద వారికి గుప్పెడు బియ్యం ప్రోగ్రాం ద్వారా చేయూతనిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు పొదుపుతో పాటు పరిశుభ్రపై దృష్టి పెట్టాలని సూచించారు. తడి, పొడి చెత్తను ఇంట్లోనే వేరు చేసి పంచాయతీ ట్రాలీలో వేయాలన్నారు. గ్రామ పరిశుభ్రతలో మహిళల పాత్ర ఎక్కువగా ఉండాలన్నారు. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం ఆన్లైన్లో చేసుకునేలా సభ్యులను తీర్చిదిద్దాలని సూచించారు. అభయహస్తం పింఛన్లు త్వరలో వస్తాయన్నారు.
మరియపురం సర్పంచ్ కృషి గొప్పది
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు వారికి ఉపాధి కల్పించేలా కట్టుశిక్షణ ఇప్పిస్తున్న మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషి గొప్పదని సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. కుట్టు మిషన్ వర్కు నేర్చుకునే మహిళలందరికీ టెక్స్టైల్స్ పార్కులో ఉద్యోగాలు వచ్చేలా ఇప్పటి నుంచే సర్పంచ్ వారిని తయారు చేస్తున్నారన్నారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామాభివృద్ధి ఫొటో గ్యాలరీని పరిశీలించారు. గ్రామంలో సోలార్ సిస్టర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. మరియపురం సాధించిన ప్రగతి, జాతీయ స్థాయి అవార్డు గురించి సర్పంచ్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడె, డీఆర్డీవో సంపత్రావు, ఎల్డీఎం హవేలి రాజు, డీపీవో కల్పన, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, తహసీల్దార్ రియాజొద్దీన్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో ప్రభాకర్, ఏపీఎం సురేశ్కుమార్, కోనాయిమాకుల, గంగదేవిపల్లి సర్పంచ్లు డోలి రాధాబాయి, మల్లారెడ్డి, ఊకల్ ఎంపీటీసీ వీరరావు, వీవో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రైతుల ఆర్థికాభివృద్ధికి మరింత కృషిచేయాలి
చెన్నారావుపేట : చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధి కోసం రైతు ఉత్పత్తిదారుల సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వారి అభివృద్ధికి మరింత కృషి చేయాలని సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. చెన్నారావుపేటలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆశాజ్యోతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వయం ఉపాధితో అభివృద్ధి సాధిస్తున్న మహిళా సంఘాల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం రైతు ఉత్పత్తి దారుల సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఉపయోగపడేలా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో అద్దెకు యంత్ర పరికరాలను అందించి, రైతుల ఆర్థికాభివృద్ధికి మహిళా సంఘాలు సహకరించాలన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంట కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయలేదని, భవిష్యత్లో జాగ్రతగా నిర్వహించాలని సూచించారు. గత ఏడాది ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళా సంఘాలు రెండు నెలల్లో రూ.2 కోట్ల ఆదాయం పొందాయన్నారు. ప్రావీణ్య మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన మార్పులకు మహిళా సంఘాలు ముందుకు రావాలన్నారు. డ్రోన్లతో చేసే వ్యవసాయాన్ని రైతులకు వివరించి, పని ముట్లతో పాటు వారికి డ్రోన్ పరికరాలను అద్దెకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారులు వైఎన్రెడ్డి, రజిత, డీఆర్డీవో సంపత్రావు, శ్రీనివాస్, డీపీవో కల్పన, తహసీల్దార్ ఫణికుమార్, ఎంపీడీవో భారతి, జడ్పీటీసీ పత్తినాయక్, సర్పంచ్ కుండె మల్లయ్య, ఎంపీవో శ్రీధర్రాజు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.