రామప్ప ఆలయ నిర్మాణం, శిల్ప సంపద అద్భుతం.. అపూర్వమని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, శ్రీనివాస్గౌడ్, జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి బయటకు వచ్చేంత సేపు నిర్మాణ కౌశలాన్ని, శిల్పాలను ఆసక్తిగా తిలకించి ఆలయ విశిష్టత గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం ప్రసాద్ స్కీమ్లో భాగంగా రూ.62 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కామేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా గిరిజన కళాకారులు ప్రదర్శించిన నృత్యరీతులను వీక్షించి.. సాయంత్రం 4.40కి హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. రాష్ట్రపతి గంటన్నర పాటు రామప్పలో గడపగా, పర్యటన ప్రశాంతంగా ముగిసింది.
ములుగు, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : రామప్ప ఆలయాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించారు. రామప్ప చరిత్రలో తొలిసారి వచ్చిన రాష్ట్రపతికి జిల్లా అధికార యంత్రాంగం అపూర్వ స్వాగతం పలికింది. భద్రాచలం నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న ఆమె మేయిన్ గేట్ నుంచి కాలినడకన ఆలయంలోకి వెళ్లారు. తొలుత గర్భగుడిలోని రుద్రేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించారు. జీవం ఉట్టిపడేలా ఉన్న మదనికలను, సప్తస్వరాలను పలికే పొన్నచెట్టు వేణువు, భారత ఇతిహాసాలను తెలిపే శిల్పాలను వీక్షించి ఆనందించారు. రామప్ప ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపు కోసం రూపొందించిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ కమిటీ విధించిన నిబంధనలు, యునెస్కో గుర్తింపు వచ్చేందుకు చేసిన కృషి తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్ పాండురంగారావు వివరించారు.
అపూర్వ స్వాగతం పలికిన జిల్లా యంత్రాంగం
భద్రాచలం నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి మధ్యాహ్నం 2:55 గంటలకు రామప్పకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ పుష్పగుచ్ఛాలు అందించి అపూర్వ స్వాగతం పలికారు. అక్కడినుంచి రామప్ప మెయిన్ గేటు దాకా కాన్వాయ్లో చేరుకొని ఆలయంలోకి వెళ్లారు. ఇక్కడ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే దనసరి అనసూయ, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతిని ఆలయంలోకి స్వాగతించారు. రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి కానుకలు సమర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో పాటు గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అర్చకులు తీర్థప్రసాదాలను అందించి శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ చీరె, సారెను అమ్మవార్ల పూజారులు రాష్ట్రపతికి అందించారు.
ప్రశాంతంగా పర్యటన
రాష్ట్రపతి రామప్ప పర్యటన ప్రశాంతంగా ముగిసింది. వారం రోజులుగా అధికారులు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సక్సెస్ అయ్యాయి. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఎస్పీ పర్యవేక్షణలో హెలిప్యాడ్ ఏర్పాటు సహా అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యటన విజయవంతమైంది. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, తుమ్మల హరిబాబు, ఎంపీపీలు బుర్ర రజిత, గండ్రకోట శ్రీదేవీ సుధీర్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి, సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రూ.62 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆలయ సందర్శన అనంతరం గార్డెన్ ఆవరణలోని సభా వేదిక వద్దకు చేరుకొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రసాద్ స్కీమ్లో భాగంగా రూ.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కామేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల శిలాఫలకాలను రాష్ట్రపతి ముర్ము రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం ‘పరంపర’ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ఆలయాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆమె వీక్షించారు. తెలంగాణ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా గోదావరి నదీ తీర ప్రాంత కోయ గిరిజనులు ప్రదర్శించిన కొమ్ముకోయ నృత్యం, మహాశివుడిపై ఢిల్లీ నృత్య కళాకారుల నృత్యరూపకం ఆకట్టుకున్నాయి. అనంతరం పరంపర నృత్య కళాకారులు ‘బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే’ అనే నృత్యరూపకాన్ని ప్రదర్శించగా రాష్ట్రపతితో పాటు గవర్నర్, మంత్రులు, అధికారులు వీక్షించారు. జాతీయ గీతాలాపనతో రాష్ట్రపతి పర్యటన మగియగా హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనం అయ్యారు.
ప్రసాద్ పథకంలో చేపట్టనున్న పనులివే..
వెంకటాపూర్, డిసెంబర్ 28 : రామప్పలో ప్రసాద్ పథకం కింద రూ.63 కోట్లతో చేపట్టబోయే పనులను బోర్డుల ద్వారా డిస్ప్లే చేశారు. పార్కింగ్, టాయిలెట్స్ బ్లాక్, సావనీర్ షాప్స్, ఫౌంటెయిన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, లాండ్ స్కేప్ ఫీచర్, ఎంట్రెన్స్ ఆర్చ్ అండ్ సెక్యూరిటీ, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టులను 37 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 ఎకరాల విస్తీర్ణంలో 42.14 కోట్లతో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, మల్టీమోడల్ పార్కింగ్, ఫుడ్ కోర్టు, ప్లే ఏరియా, మెడిటేషన్ సెంటర్, టాయిలెట్ కాంప్లెక్స్, 27 ఎకరాల విస్తీర్ణంలో 9.48 కోట్లతో ప్రొమనేడ్ అండ్ గార్డెన్స్, ఓఏపీ, తీమాటిక్ గార్డెన్స్, ఆలయం వరకు పాత్వే, 3.35 కోట్లతో రామప్ప సరస్సు కట్ట సుందరీకరణ, స్నాక్ కౌంటర్స్, పార్కింగ్ ఏరియా, పాన్ ఏరియాలో 8.12 కోట్లతో డిస్ప్లే బోర్టులు, సీసీటీవీ సర్వేలైన్స్, జాతీయ రహదారి వద్ద స్వాగత తోరణం నిర్మించనున్నారు.