బయ్యారం డిసెంబర్ 28 : దేశ భవిష్యత్ బాలల చేతుల్లోనే ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బుధవారం సమ్మక్క-సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్న ఆమె, అక్కడినుంచి బయ్యారం మండలం నామాలపాడులో రూ.35కోట్లతో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఏకలవ్య పాఠశాలలు ఎంతో ఉపయోగపడుతాయని, వీటిలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏకలవ్య పాఠశాలలు దోహదపడుతాయన్నారు.
గిరిబిడ్డలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏకలవ్య పాఠశాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వర్చువల్ ద్వారా విద్యార్థులను నేరుగా చూసి మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయించిన మంత్రి సత్యవతి రాథోడ్ను రాష్ట్రపతి అభినందించారు.
రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్దపీట : మంత్రి సత్యవతి రాథోడ్
ప్రారంభ సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యంతో పాటు గిరిజనుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఏకలవ్య పాఠశాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మోత్తం 23 ఏకలవ్య పాఠశాలలు, 183 గిరిజన గురుకులాలు, 22 డిగ్రీ కళాశాలలు ఉండగా వీటిలో బాలికల కోసం ప్రత్యేకంగా 33 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన గ్రామాలు, గూడేలపై ప్రత్యేక శ్రద్ధతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 12 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి గిరిజన బిడ్డలకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గిరిజన సంస్కతీ సంప్రదాయాలకు సముచిత గౌరవం దక్కుతోందన్నారు.
ప్రభుత్వ విద్యపై నమ్మకం : ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్పీ అధ్యక్షురాలు అంగోత్ బిందుతో కలిసి పాఠశాలలో ఆమె జ్యోతి ప్రజ్వలన చేశా రు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం అనేక గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కృషివల్లే గిరిజన కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నందున విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు.
బయ్యారం ఏకలవ్య విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందున్నారని అభినందించారు. జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు గతంలో సరైన విద్య అందేది కాదని, రాష్ట్ర ప్రభుత్వం కృషితో ఇప్పడు మారుమూల ప్రాంతాల వారికి సైతం నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలో ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో ఎంపీపీ చేపూరి మౌనిక, సర్పంచ్ కిరణ్, ఎంపీటీపీ ఉపేంద్ర, ఏకలవ్య పాఠశాలల డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఆర్సీవో రాజ్యలక్ష్మీ, ప్రిన్సిపాల్ రవిబాబు, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో చలపతిరావు, సొసైటీ చైర్మన్ మశుకర్రెడ్డి, వైస్ ఎంపీపీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.