సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని వేద పండితులు, అర్చకులు, ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్కు రూపకల్పనచేసి, హైదరాబాద్లో విప్రహిత బ్రాహ్మణ భవనాన్ని సకల వసతులతో నిర్మించి వైభవంగా ప్రారంభించడం అభినందనీయమని కొనియాడుతున్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడుతూ ధూప, దీప నైవేద్య పథకం కింద అర్చకుల వేతనాన్ని రూ. 6వేల నుంచి రూ. 10వేలకు పెంచడం, వేద పండితులకు నిరుద్యోగ భృతి కింద రూ.5వేలు ఇవ్వడం హర్షణీయమని అభినందిస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదగిరిగుట్ట ఆలయాలకు పూర్వవైభవం తెచ్చి, బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ప్రపంచమే తిరిగి చూసేలా నిర్వహిస్తూ కేసీఆర్ నిజమైన ధార్మికవేత్తగా నిలిచిపోయారని అభివర్ణిస్తునారు. ఓ వైపు ఆధ్యాత్మికం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమాలపై దృష్టిపెట్టి అన్ని మతాలనూ గౌరవిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్న కేసీఆరే నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు అని స్పష్టం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 1
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 1 : రాష్ట్రంలో 16 లక్షల మంది బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేస్తున్న కృషి ఎనలేదని, బ్రాహ్మణుల ఆకాంక్ష మేరకు హైదరాబాద్లో రూ.12కోట్లతో ఆరు ఎకరాల్లో విప్రహిత బ్రాహ్మణ భవన్ను నిర్మించి ప్రారంభించడం గొప్ప విషయమని బ్రాహ్మణులు, అర్చకులు అభినందిస్తున్నారు. హైదరాబాద్లో బ్రాహ్మణ భవన్ను సీఎం ప్రారంభించిన సందర్భంగా పలువురు అర్చకులు, బ్రాహ్మణులు ‘నమస్తే’తో తమ సంతోషాన్ని గురువారం పంచుకున్నారు. దేశంలోని 29 రాష్ర్టాల్లో కేవలం తెలంగాణలోనే బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. ఇప్పటివరకు పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.200కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం చేసుకునేందుకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా రూ.130 కోట్ల నిధులు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ధూపదీప నైవేద్య అర్చకులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2500 ఇస్తే సీఎం కేసీఆర్ రూ.6వేలు ఇస్తున్నారని, ఇప్పుడు దానిని రూ.10వేలకు పెంచడం హర్షణీయమన్నారు.
వృద్ధులైన వేద పండితులకు ప్రతినెలా జీవన భృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచడం వల్ల ఎంతో ఆసరా అందినట్లవుతుందన్నారు. ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ వస్తున్నారని, సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకున్న గొప్ప జ్ఞాని కేసీఆర్ అని, అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ సుభిక్ష పాలన అందిస్తున్న కేసీఆరే నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడని కొనియాడుతున్నారు. కేసీఆర్ పాలనలోనే బ్రాహ్మణ సమాజానికి గౌరవం పెరిగిందని, అర్చకుల అర్థిక స్థితిగతులపై అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇస్తున్న గొప్ప నాయకుడని పేర్కొన్నారు. భావితరాలకు సనాతన ధర్మాన్ని అందించాలన్న సంకల్పంతో ఆయన ముందుకు పోతున్నారని, సీఎం కేసీఆర్ మేలును బ్రాహ్మణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని స్పష్టం చేస్తున్నారు.
సార్ మేలు జీవితంలో మర్చిపోలేం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : నేను భూపాలపల్లి మండలం వజినపల్లిలోని పరమ శివాలయంలో ధూప దీప, నైవేద్య అర్చకుడిని. సమైక్య రాష్ట్రంలో ధూప దూప, నైవేద్య అర్చకులకు నెలకు రూ.2500 వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సార్ మా ఇబ్బందులను చూసి గౌరవ వేతనాన్ని రూ.6వేలకు పెంచారు. ఇటీవల పూజా సామాగ్రి ధరలు పెరగడంతో ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు రూ.10వేలు పెంచారు. ఇందులో రూ.4వేలు పూజా సామగ్రికి పోను మిగిలిన రూ.6వేలు కుటుంబ పోషణకు అవుతున్నాయ్. మా ఇబ్బందులను తెలుసుకొని గౌరవప్రదంగా బతికేలా వేతనం పెంచిన కేసీఆర్ సార్ మా చేసిన మేలు జీవితంలో మర్చిపోలేము. స్వరాష్ట్రంలోనే మా జీవితాలు బాగుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్ మున్ముందు మా కోసం మరిన్ని మంచి పనులు చేస్తారనే నమ్మకం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి తర్వాత తెలంగాణ రూపురేఖలు మారాయి. రాష్ట్రం రాకముందు అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అందరికీ ఏదో ఒక మేలు చేస్తూ ఆదుకుంటున్నరు. కేసీఆర్ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కర్నె సాంబయ్య, ధూప దీప, నైవేద్య,
అర్చక సంఘం గౌరవాధ్యక్షుడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేసీఆర్తోనే ఆలయాలకు పూర్వవైభవం
డోర్నకల్, జూన్ 1 : సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా ధూప దీప నైవేద్యాల కోసం రూ.10వేలు, రాష్ట్రంలోని 2,796 ఆలయాల విస్తరణ, వేద పండితులకు గౌరవ భృతి రూ.5వేలు పెంపు ప్రకటనలు చాలా సంతోషాన్నిచ్చాయి. గతంలో ఆలయాలను పట్టించుకున్న వారు లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆలయాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టి పూర్వ వైభవం తెస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నది. వేద పండితులను, అర్చకులను సేవలను గుర్తించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. తెలుగు జాతి సంస్కృతీ సంప్రదాయాలను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతున్నది. అలాగే ప్రజలకు భక్తిభావం పెంపొందిస్తున్నారు. వేద పండితులు, అర్చక కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– తిరునగరి యాదగిరి స్వామి, సీతంపేట రామాలయ అర్చకులు
సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకున్న గొప్ప జ్ఞాని కేసీఆర్
వరంగల్, జూన్ 1 : సనాతన ధర్మ పరిరక్షకుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ధర్మ పరిరక్షణలో పాలకులు విఫలమయ్యారు. ఉద్యమకాలం నుంచే కేసీఆర్ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ వస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకున్న గొప్ప జ్ఞాని ఆయన. అన్ని మతాల ధర్మాన్ని పరిరక్షిస్తున్న సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పాటైన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది. సమైక్య పాలకులు ధూపదీప నైవేద్యాల కోసం రూ.2500 ఇస్తే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని రూ.6 వేలకు పెంచారు. ఇప్పుడు ధూపదీప నైవేద్యాల కోసం రూ.10 వేలకు పెంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అనువంశిక అర్చకుల సమస్యపై క్యాబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని హమీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. దీని వల్ల సుమారు 10వేల అనువంశిక అర్చకులకు న్యాయం జరుగుతుంది. వలస వెళ్లిన అనువంశిక అర్చకులు తిరిగి తమ గ్రామాలకు వచ్చే అవకాశం కలుగుతుంది. కేసీఆర్ పాలనలో బ్రాహ్మణ సమాజానికి గౌరవం పెరిగింది. అర్చకుల ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇస్తున్న గొప్ప నాయకులు. భావితరాలకు సనాతన ధర్మాన్ని అందించాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకుపోతున్నారు. బ్రాహ్మణ సమాజం కేసీఆర్ను మరిచిపోదు.
– భద్రకాళి శేషు, ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు
బ్రాహ్మణుల అభ్యుదయం కోసం బ్రాహ్మణ సదనం
హనుమకొండ చౌరస్తా, జూన్ 1 : సీఎం కేసీఆర్ లోక క్షేమం కోరుకునే బ్రాహ్మణుల అభ్యుదయం కోసం వారి ఆకాంక్ష మేరకు హైదరాబాద్లో బ్రాహ్మణ భవన్ నిర్మిస్తానని వరంగల్ కేడీసీ గ్రౌండ్ వేదికగా జనవరి 9, 2015లో తెలంగాణ అర్చక సమాఖ్య బ్రాహ్మణ సంఘాల సదస్సులో మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్. దేశంలోని 29 రాష్ర్టాల్లో తెలంగాణలో మాత్రమే బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి ఇప్పటివరకు 200 కోట్ల నిధులు కేటాయించి, చిరు వ్యాపారం చేసుకునేందుకు రూ.130 కోట్లు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మెరిట్ ఉన్నా చదువుకోలేని పేద బ్రాహ్మణ విద్యార్థులకు రూ.70 కోట్లు కేటాయించారు. వేలాది మందికి ఆర్థికసాయం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ధూపదీప నైవేద్య అర్చకులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2500 ఇస్తే సీఎం కేసీఆర్ రూ.6వేలు ఇస్తున్నారు. గతంలో తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్, నల్గొండలో కలిసి విజ్ఞాపన పత్రం అందించడంతో సీఎం కేసీఆర్ స్పందించి రూ.6 వేల నుంచి రూ.10 వేలు పెంచడం వల్ల 6400 మందికి మేలు కలుగుతుంది.
– గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షుడు, వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు
కేసీఆర్ వల్లే నెలనెలా జీతాలు
వెంకటాపూర్, జూన్ 1 : నేను 2008 నుంచి రామప్ప ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తున్నా. నాకు మొదట 2వేలు మాత్రమే జీతం వచ్చేది. ఆలయానికి వచ్చే ఆదాయం నుంచే చెల్లించేవారు. అది కూడా 2, 3 నెలలకోసారి ఇచ్చేవారు. బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక కృషి వల్ల ఆలయ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి నెల రూ.40వేల జీతం అందుకుంటున్నా. అప్పడు చాలీచాలనీ జీతాలతో బతుకుడే కష్టంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు తీసుకుంటున్నామంటే అది కేవలం కేసీఆర్ చలవే. వారికి సంప్రదాయాలు, సంస్కతి, అర్చకుల పట్ల ఎనలేని గౌరవం ఉండడం వల్లే మా జీవితాల్లో వెలుగులు నిండాయి. ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ అర్చకులకు పెద్దపీట వేయడం చాలా సంతోషం.
– మోహనమఠం ఉమాశంకర్, రామప్ప అర్చకులు
మా రాష్ట్రంలోనూ అమలుచేస్తే బాగుండు..
నెక్కొండ, జూన్ 1 : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజానికి మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకొని చరిత్రలో నిలిచారు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ధార్మిక, ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ బ్రాహ్మణుల్లో భరోసా నింపారు. మా పక్కనే ఉన్న తెలంగాణలో వేద పండితులకు గౌరవ భృతి పెంచడం, మూతపడ్డ ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం మరికొన్నింటికి ఎంపిక చేసి తెరిపించడం, ఈ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు గౌరవ వేతనాన్ని సముచితరీతిలో పెంచడం చూస్తుంటే చాలా సంతోషం వేస్తున్నది. మా రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు అమలైతే బాగుండు అనిపిస్తున్నది. వైదిక, ఆధ్మాత్మిక కార్యక్రమాల కోసం హైదరాబాద్, వరంగల్ తదతర ప్రాంతాలకు వెళ్లే మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్కు అభిమానపాత్రులమయ్యాము.
– కౌశిక్ శర్మ, విజయవాడ-భద్రాచలం
వేద పాఠశాల పూర్వవిద్యార్థి బ్రాహ్మణ సంక్షేమం.. హర్షణీయం
మంగపేట : ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం ఇస్తున్న రూ.6వేలను రూ10వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం, హైదరాబాద్లో గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణసదనం ప్రారంభించడం బ్రాహ్మణలకు, అర్చకులకు చాలా సంతోషకరమైన విషయం. పూర్వం రాజుల కాలం నుంచి అనేక అసౌకర్యాల నడుమ నిత్యపూజలతో ఆలయాల్లో భగవంతుడి సేవలో ఉన్న బ్రాహ్మణుల సంక్షేమంపై దృష్టి సారించడం శుభపరిణామం. ముఖ్యమంత్రి కేసీఆర్ దీర్ఘాయుష్షుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– కైంకర్యం రాఘవాచార్యులు, ప్రధాన అర్చకుడు, మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు
ఖిలావరంగల్, జూన్ 1 : నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. సనాతన ధర్మాన్ని కాపాడుటలో ఎల్లప్పుడు ముందుంటారు. బడ్జెట్లో దేవాదాయ శాఖకు రూ.250 కోట్లు కేటాయించిన ఏకైక నాయకుడు కేసీఆర్. రా్రష్ట్రంలో పలు ఆలయాలను జీర్ణోద్ధరణతో పూర్వవైభవం తీసుకొస్తున్నారు. పర్యావరణ సమతుల్యానికి, కాలుష్య నివారణకు, విశ్వశ్రేయస్సు, ప్రజల ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తున్నాడు. అలాగే లోక కల్యాణం కోసం పాటుపడుతున్న బ్రాహ్మణ వర్గం కోసం దేశంలోనే ప్రథమంగా బ్రాహ్మణ పరిషత్ను స్థాపింపడం గొప్ప విషయం. బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం రూ.100 కోట్లు నిధిని ఏర్పాటుచేసిన ఘనత ఆయనదే. మారుమూల ప్రాంతాల్లో నిధుల కొరతతో ఉన్న దేవాలయాల అర్చకులకు ధూప, దీప, నైవేద్యాలకు సహకరాం అందిస్తున్నాడు. 65ఏళ్లు దాటిన వేద, శాస్త్ర పండితులకు రూ.5వేల గౌరవ పారితోషికాన్ని అందిస్తున్నారు. బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఆర్థ్ధిక సహాయం అందిచేస్తూ బ్రాహ్మణ బంధువయ్యారు. అలాగే బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్ర రాజధానిలో సువిశాల ప్రాంగణంలో బ్రాహ్మణ సదనం నిర్మించిన సీఎం కేసీఆర్ వివిధ పీఠాధిపతులతో కలిసి ప్రారంభించడం హర్షణీయం.
– సముద్రాల శఠగోపాచార్య, ప్రధాన కార్యదర్శి, సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్టు, వరంగల్