వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 26: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ద్వితీయ సంవత్సరం సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా మనస్తాపానికి గురైన ప్రీతి ఈ నెల 22న బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తూనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితిలోవున్న ప్రీతిని తోటి విద్యార్ధులు గుర్తించి అధికారులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించి వైద్యసేవలను ప్రారంభించారు. అదే రోజు ప్రీతిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. నాలుగు రోజులుగా వైద్యసేవలు అందిస్తున్న నిమ్స్ వైద్యులు ఆదివారం పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందినట్లు ప్రకటించారు. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నిందితుడు సైఫ్ను గురువారం అదుపులోకి తీసుకొని విచారించి, శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించి వివరాలను వెల్లడించారు. ప్రీతి మృతిపై వైద్యవిద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రా యి గ్రామం. తండ్రి ధరావత్ నరేందర్ వరంగల్ రైల్వే స్టేషన్లో రైల్వే ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. నరేందర్కు మృతురాలు మూడో కూతురు. ప్రీతి మృతి చెంది నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇంతేజార్గంజ్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు కేఎంసీ, ఎంజీఎం హాస్పటల్స్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.