అధికారులు బాధ్యతగా పనిచేయాలి
పారిశుధ్యం, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
నాలాలు, డ్రైనేజీలను శుభ్రం చేయించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
విలీన గ్రామాలపై ప్రత్యేక
శ్రద్ధ తీసుకుంటున్నాం: మేయర్ సుధారాణి
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చీఫ్ విప్ దాస్యం, మేయర్ సుధారాణితో కలిసి రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. నాలాలను, డ్రైనేజీల ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పారిశుధ్యం, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
హనుమకొండ, జూన్ 28: మహానగరంలో చేపట్టనున్న వరద నివారణ చర్యల్లో అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. హనుమకొండలోని కలెక్టరేట్లో వర్షాకాలంలో ముందస్తు చర్యలపై ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని మంత్రి కోరారు. నాలాలు డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. వడ్డేపల్లి, భద్రకాళి, నయీంనగర్, బొందివాగు, శాఖరాశికుంట వంటి ప్రధాన నాలాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేస్తే నగరం ముంపునకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. టోల్ఫ్రీ నంబర్ 180042 51980పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. నగరంలోని 18 ప్రధాన రహదారుల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, 40 కాలనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పోలీసులు, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్హెచ్ అధికారులతో టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎజెండా సిద్ధం చేసి కార్యాచరణ రూపొందించి, దానికనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. భద్రకాళి నాలా బండ్ పక డ్రైన్ను రూ. 143 కోట్లతో ఏర్పాటు చేశామని, వర్షాకాలం తర్వాత వెంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. టాసోఫోర్స్ బృందాల ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పారు. చెరువులు ఆక్రమణకు కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ వరద సమస్యలు పునరావృతం కాకుండా గ్రేటర్లో విలీనమైన గ్రామాల్లో నాలాలు శుభ్రంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల మత్తడి వల్ల కొన్ని ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ గోపాలపురం చెరువు వరద గతంలో, భవిష్యత్లో ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ 2020లో వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకొని డీఆర్ఎఫ్ టీంలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీంలను రెండు నెలల కోసం పిలిపించి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ పట్టణప్రగతి కార్యక్రమంలో మాన్సున్కు సంబంధించిన పనులు చేపట్టామన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ మహానగరంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు వరద నివారణ చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు చేసిన, చేపట్టబోయే పనులను ఆమె వివరించారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ఖాన్, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్హెచ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.