జమ్మికుంట, నవంబర్ 13: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 17న జమ్మికుంటకు రానున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. సీఎం సభ కోసం కళాశాల మైదానంతో ఏర్పాట్లు చేస్తున్నామని, లక్ష మందితో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. సోమవారం పాడి కౌశిక్రెడ్డి జమ్మికుంటకు వచ్చారు. కళాశాల క్రీడా మైదానాన్ని సందర్శించారు. సభాస్థలిని పరిశీలించారు.
సభా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు హాజరయ్యే ప్రజల రూట్ మ్యాప్, తదితర అంశాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో చర్చించారు. విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ కనీవిని ఎరుగని తరహాలో నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశామని, నిర్వహించబోయే సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష మంది కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, వాహనాలు నిర్దేశించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాయిని చెరువు వద్దకు వెళ్లారు. హెలీప్యాడ్ను పరిశీలించారు. బీఆర్ఎస్ అర్బన్పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వాలా బాలకిషన్రావు, పోల్నేని సత్యనారాయణరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి పాల్గొన్నారు.