భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రాకు పార్టీ శ్రేణులతో కలిసి ఆమె వినతి పత్రాన్ని అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం మన జిల్లాలోనే ఉన్నా సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారని చెప్పారు. ప్రాజెక్ట్లో వెంటనే కాఫర్ డ్యాం నిర్మించి రైతులకు సాగు, తాగు నీరు అందజేయాలని, చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.
పది మందికి అన్నం పెట్టే రైతన్న కన్నీటితో తన ఆకలి చంపుకొనే దుస్థితికి చేరుకున్నాడని ఆవేదన చెందారు. రైతుబంధు రూ.15 వేలు, రుణమాఫీ రూ.2లక్షలు, మద్దతు ధరకు రూ.500 బోనస్, ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం, నాణ్యమైన 24 గంటల కరెంట్, అప్పుల బాధతో మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న జిల్లా కేంద్రంలో నిరసన చేపడతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.