వరంగల్, ఫిబ్రవరి 24 : కాంగ్రెస్ పాలనలో దేవాలయాలకు రాజకీయ రంగు పులుముతున్నారు. సంబంధిత అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో మంగళవారం జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుంగ అనుచరుడికి అధికారులు, అర్చకులు ప్రొటోకాల్ ప్రకారం బ్రహ్మరథం పట్టడంతో ఆలయానికి వచ్చిన సామాన్య భక్తులు విస్తుపోయారు.
జిల్లా మేజిస్ట్రేట్ ఆలయానికి వచ్చినా పట్టించుకోకుండా మంత్రి అనుచరుడికి ప్రొటోకాల్తో స్వాగతం పలకడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు వరంగల్ బట్టల బజార్లోని వేంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభయ్యాయి. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులతో జ్యోతి ప్రజ్వలన చేయించాలి. కానీ, ప్రొటోకాల్ లేని మంత్రి కొండా సురేఖ అనుచరుడి చేతుల మీదుగా అధికార లాంఛనాలతో జ్యోతి ప్రజ్వలన చేయించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం విమర్శలకు దారితీసింది.
ఆలయ ఈవో స్వయంగా ఆక్కడ ఉండి మంత్రి అనుచరుడితో జ్యోతి ప్రజ్వలన చేయించి ప్రొటోకాల్ను ఉల్లంఘించడం గమనార్హం. ఆలయ ఈవో వ్యవహరంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే భద్రకాళీ ఆలయంలోకి అడుగుపెట్టిన మంత్రి కొండా సురేఖ అనుచరుడి అనుచరుల హంగామా అంతా ఇంతా కాదు. మంది మార్బలంతో వచ్చిన ఆయనతో సుమారు 30 నిమిషాలపాటు అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. అతని అనుచరులకు కండువాలు కప్పి ఆలయ నిబంధనలు ఉల్లంఘించారు. అమ్మవారి సేవలో ఉండాల్సిన అర్చకులు మంత్రి అనుచరుడి సేవలో తరించి పోయారు. దీనిని గమనించిన సామాన్య భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
ఆ సమయంలో నేను దేవాలయంలో లేను. జిల్లా మెజిస్ట్రేట్ ఆలయానికి వస్తున్నట్లు సమాచారం లేదు. ప్రొటోకాల్ లేని వ్యక్తికి స్వాగతం పలకడం సరైంది కాదు. దీనిపై విచారణ జరిపి మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటా.
– రామల సునీత, డిప్యూటీ కమిషనర్, భద్రకాళీ ఆలయ ఈవో
బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో తప్పు జరిగింది. ప్రొటోకాల్ ఉన్న వారితో బ్రహ్మోత్సవాలను ప్రారంభించాలి. వేడుకలను మం త్రు లు, ఎమ్మెల్యే, ఎంపీలతో ప్రారంభించాలి. అనుకోకుండా అక్కడ ప్రొ టోకాల్ పాటించలేక పోయాం. తప్పు జరిగింది. ఒప్పుకుంటున్నాను.
– రత్నాకర్ రెడ్డి, ఈవో, వేంకటేశ్వరస్వామి దేవాలయం