సుబేదారి, జూలై 11 : వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు పోలీసు శాఖ బదిలీ నిబంధనలు వర్తించవు. అధికారులు, ఇతర సిబ్బందికి స్థానచలనం జరిగినా వీరు మాత్రం కుర్చీని వదలరు.. అక్కడి నుంచి కదలరు. ఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోయారు. కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి పనిచేసిన సుధీర్బాబు, రవీందర్, ప్రమోద్, తరుణ్జోషి, రంగనాథ్, అంబర్కిషోర్ఝా, సన్ప్రీత్సింగ్, ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్వేత వరకు వారి క్యాంప్ క్లర్క్ (సీసీ)గా మినిస్టీరియల్ ఉద్యోగి 11 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అలాగే 20 ఏళ్లుగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో)గా పనిచేస్తున్న ఉద్యోగి పదోన్నతి వచ్చినా కూడా బదిలీ కాకుండా అదే పోస్టులో కొనసాగుతున్నాడు.
వరంగల్ కమిషనరేట్కు సీపీగా ఎవరు వచ్చినా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ కుర్చీ వదలకుండా కొనసాగుతున్న సీసీపై అనేక ఆరోపణలున్నాయి. అతడికి స్థాన చలనం అనేదే జరగడం లేదు. ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే.. అతను అనుమతిస్తేనే కమిషనర్ను కలవాల్సి ఉంటుంది. లేదంటే అంతే సంగతి. ఇక న్యాయం కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితుల్లో పైరవీ, పలుకుబడి ఉన్న వారిని మాత్రమే సీపీ వద్దకు పంపిస్తాడనే విమర్శలున్నాయి. ప్రధానంగా భూ వివాదాల విషయంలో అవినీతి అధికారులపై బాధితులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు వారికి లీకులిచ్చి అలర్ట్ చేస్తాడనే ఆరోపణలున్నాయి.
ఇక తనకు అనుకూలంగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫైళ్లను కమిషనర్ సంతకాల కోసం త్వరగా పంపించి, మిగతా వారివి వివిధ కారణాలతో పెండింగ్లో పెడతాడనే విమర్శలున్నాయి. అవినీతి అధికారులపై సీపీ తీసుకునే సస్పెన్షన్, బదిలీ వేటు సమాచారాన్ని కూడా వారికి ముందుగానే చేరవేస్తాడనే ప్రచారం జరుగుతున్నది. గతంలో ఇద్దరు సీపీలు బదిలీ అయిన సమయంలో సిబ్బందికి స్థానచలనం, ఉద్యోగోన్నతి జాబితాపై హడావిడిగా సంతకాలు చేయించి చేతివాటం ప్రదర్శించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇతర జిల్లాల్లో భూ వివాదాన్ని కూడా ఇక్కడ పనిచేసి ప్రస్తుతం హైదారాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న ఉన్నతాధికారి సహకారంతో సెటిల్ చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది.
ఇక పీఆర్వో కూడా ఏళ్ల తరబడి కుర్చీ వదలకుండా ఒకే పోస్టులో పనిచేస్తున్నాడు. సుమారుగా 18 ఏళ్ల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా పనిచేసిన రాష్ట్ర స్థాయి అడిషనల్ డీజీతో సత్సంబంధాలు పెట్టుకొని, ఇక్కడికి సీపీ ఎవరు వచ్చినా అతడితో చెప్పించుకొని తన పోస్టును కాపాడుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగోన్నతి పొంది మహబూబాబాద్కు బదిలీ అయినప్పటికీ అక్కడ రెండు రోజులు కూడా డ్యూటీ చేయకుండా వెంటనే హనుమకొండ ట్రాఫిక్కు పోస్టింగ్ పొందాడు. ఇక్కడ 30 శాతం ట్రాఫిక్ అలవెన్స్ తీసుకుంటూ పీఆర్వో డ్యూటీనే నిర్వర్తిస్తున్నాడు. పోలీసు ఉన్నతాధికారుల మధ్యే తిరుగుతూ 20 ఏళ్లుగా ఏ ఒక్క రోజు కూడా ఒంటిపై ఖాకీ డ్రెస్ వేయకపోవడం గమనార్హం.