సుబేదారి, జనవరి 6: మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఫైనాన్షియర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు మృతుడితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కూతురు పెళ్లికి ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కక్ష పెంచుకుని క్రూరంగా హత్య చేయించాడు. నవంబర్ 21న రాత్రి జరిగిన ఈ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ డాక్టర్ తరుణ్జోషి గురువారం వెల్లడించారు. మృతుడు కోక కోటేశ్వర్రావు, ప్రధాన నిందితుడు బైరి గురుమూర్తి ఇద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ పరిచయంతో గురుమూర్తి తన పెద్ద కూతురు వివాహం కోసం ఇంటి దస్తావేజులు పెట్టి కోటేశ్వర్రావు వద్ద రూ. 5 లక్షల అప్పు తీసుకున్నాడు. గురుమూర్తికి మరిన్ని అప్పులు కావడంతో తన ఇంటిని అమ్మడానికి వేరే వ్యక్తితో ఒ ప్పందం చేసుకుని రూ.15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. తన ఇంటి దస్తావేజులు ఇవ్వాలని కోటేశ్వర్రావును గురుమూర్తి అడిగాడు. తన అప్పు వడ్డీతో చెల్లిస్తేనే దస్తావేజులు ఇస్తానని ఆయన చెప్పడంతో గురుమూర్తి కోపం పెంచుకున్నాడు. ఈక్రమంలోనే కోటేశ్వర్రావు ఇంటిలో నివాసముంటున్న నీలం శ్రీనివాస్, వెంకటేశ్వర్రావుకు ఆర్థిక లావాదేవీలపై వివాదం జరిగింది.
ఇంటి సామాను బయట పడేసి తాళం వేయడంతో శ్రీనివాస్ కూడా కోటేశ్వర్రావుపై కోపంతో ఉన్నాడు. ఇదే సమయంలో గురుమూర్తికి శ్రీనివాస్ పరిచయమయ్యాడు. ముందుగా నీలం శ్రీనివాస్.. ఆకునూరి మహారాజ్ (చనిపోయాడు)తో కోటేశ్వర్రావును బెదిరించాలని భావించాడు. కానీ, గురుమూర్తి, నీలం శ్రీనివాస్ ఇద్దరు కలిసి కోటేశ్వర్రావును చంపితేనే మొత్తం ఆర్థిక లావాదేవీల గొడవ సమసిపోతుందని అనుకున్నారు. ఇందుకోసం వారు ఆకునూరి మహారాజ్, మిగతా నిందితులతో ఒప్పందం చేసుకున్నారు. నవంబర్ 21న ఫైనాన్స్ డబ్బులు వసూలు చేయడానికి కోటేశ్వర్రావు దూపకుంటకు వస్తున్నట్లు గుర్తించారు. రాత్రి 8 గంటలకు కోటేశ్వర్రావును మభ్యపెట్టి నీలం శ్రీనివాస్ బైక్పై తూర్పుకోట తాటి వనం వద్దకు తీసుకొచ్చాడు. ఇక్కడ గురుమూర్తి, మిగిలిన నిందితులు ఒక్కసారిగా బైక్ నడుపుతున్న కోటేశ్వర్రావుపై పిడిగుద్దులు గుద్దారు. మెడ, చేతులను గనిపాక నాగరాజు విరవడంతో కోటేశ్వర్రావు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, పదివేల రూపాయలను నిందితులు దోచుకెళ్లారు. హత్య జరిగిన మరుసటిరోజు కోటేశ్వర్రావు భా ర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్, సిబ్బంది విచారణ చేపట్టి కోటేశ్వర్రావును హత్య చేసిన నిందితులను గుర్తించారు. వారు రంగశాయిపేట వాటర్ ట్యాంకు వద్ద ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. మిల్స్కాలనీ సీఐ, సిబ్బందితో అక్కడకు వెళ్లి ప్రధాన నిందితుడు బైరి గురుమూ ర్తి, నిందితులు నీలం శ్రీనివాస్, గనిపాక నాగరాజు, జన్ను కల్యాణ్, సింగారపు రాజ్కుమార్, ఎండీ గుంషావలీని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.