సుబేదారి, మార్చి5: ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయించి మోసాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిశోర్ఝా నిందితుల వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ప్రాంతంలో మట్టెవాడ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన కాట్రగౌడ భాస్కర్రెడ్డిని అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు.
భాస్కర్రెడ్డి ఇచ్చిన సమాచారంతో మట్టెవాడ, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ చర్లపల్లిలో ప్రముఖ కంపెనీలు బేయర్, టాటా, కోర్టెవా మరో నాలుగు కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు తయారు చేస్తున్న గోడౌన్పై దాడులు చేశారు. హైదరాబాద్కు చెందిన నాగవెంకటరంగారావు, ముద్దంగుల ఆదిత్య, పిట్ట నవీన్, మిర్యాలగూడకు చెందిన దూదిమెట్ల శ్రీధర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నట్లు వారు అంగీకరించారు. నిందితుల నుంచి రూ. 34 లక్షలు విలువ చేసే నకిలీ పురుగు మందులు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ లేబుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మట్టెవాడ, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు గోపి, సార్ల రాజు, సిబ్బందిని సీపీ అభినందించారు.
పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామ శివారులో నకిలీ పురుగు మందులను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏవో స్వామి, ఎస్సై క్రాంతికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. చెంచలి శ్రీను దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన పొన్నాల శ్యాంసుందర్రెడ్డి, తొర్రూరుకు చెందిన సైదులు సహకారంతో నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. శ్రీనును అదుపులోకి తీసుకొని, పురుగు మందులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.