పరకాల, మార్చి 21: జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటర్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14.19లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. హనుమకొండకు చెందిన బండారి అనిల్ ఐటీఐ పూర్తి చేసి మెకానిక్గా పనిచేస్తున్నాడు. జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించడానికి టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన మాటూరి అరవింద్తో కలిసి మోటర్లను దొంగిలించారు. అనంతరం ఒక మైన ర్, మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలకు చెందిన సరిగొప్పుల సాయితేజ, కమలాపురం హరీశ్ను కలుపుకుని మరిన్ని మోటర్లు దొంగిలించారు.
వీరు హనుమకొండలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కిరాయికి తీసుకుని పరకాల, దామెర, మొగుళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రా మాల్లో ఎస్సారెస్పీ కాల్వ, బావుల వద్ద ఉన్న మోటర్లను దొంగిలించేవారు. నడికూడ మండల శివారులో పరకాల పోలీసులు తనిఖీ చేస్తుండగా వారి కారులో 6 విద్యుత్ మోటర్లు కనిపించాయి. వారిని విచారించగా దొంగిలించిన మోటర్లను హుజూరాబాద్కు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. 5 మోటర్లు, 57 కేజీల కాపర్ వైరు, నాలుగు సెల్ఫోన్లు, రెండు కార్లు, రూ.41 వేల నగదును స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ కిశోర్కుమార్, సీఐ రవిరాజు, ఎస్సై రమేశ్, కానిస్టేబుళ్లు భాస్కర్, కృష్ణకుమార్, దేవేందర్, కే నాగరాజు, డీ నాగరాజు, భాస్కర్, హోంగార్డులు సుధాకర్, రామన్న, రవీందర్ పాల్గొన్నారు.