తొర్రూరు, జనవరి 25 : పగటి పూట ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ బీరు సీసాలు ఏరుతూ.. రాత్రి అయిందంటే తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆలయాల్లోకి చొరబడి ఇత్తడి, ఇనుప వస్తువులు, ఉత్సవ విగ్రహాలు, వాహనాలను అపహరించి అమ్ముకుంటున్న ముఠా గుట్టును తొర్రూరు పోలీసులు రట్టు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం టీచర్స్కాలనీ, కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి దొంగిలించిన వస్తువులు, నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు చోరీ వివరాలను గురువారం తొర్రూరు పోలీస్స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వరబాబు వెల్లడించారు. తొర్రూరుతో పాటు మరిపెడ, దంతాలపల్లి, మండలాల్లోని పలు ఆలయాల్లో ఇటీవల చోరీలకు పాల్పడి ఇత్తడి వస్తువులు, ఉత్సవ విగ్రహాలను ఊరేగించే వాహనాలను దొంగిలిస్తున్న ఆవుల సంజీవ, నాగిళ్ల నాగరాజు, ఎడ్ల వెంకటమ్మ, ఎడ్ల పుణమ్మ, నాగిళ్ల దుర్గ, గోపగాని రాజమ్మ, కేతేపల్లికి చెందిన పాత ఇనుప సామగ్రి కొనుగోలు వ్యాపారి చింతల పుల్లారావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో వీరిపై నకిరేకల్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఈ ముఠా బొగ్గు లారీల లోడింగ్ కోసం కూలీకి వెళ్లడం, ఖాళీ సమయాల్లో ప్లాస్టిక్ సామగ్రి, ఖాళీ సీసాలను సేకరించి విక్రయించేవారు. కాగా, సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో గతంలో దొంగతనం చేస్తూ పట్టుబడి నల్గొండ జిల్లాలో జైలు శిక్ష అనుభవించి విడుదలై వచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు.
గతేడాది జూన్ నెలలో తొర్రూరు మండలం మాటేడు వేణుగోపాలస్వామి ఆలయంలో, పెద్దముప్పారం వేంకటేశ్వరస్వామి ఆలయంలో, మరిపెడ మండలం గుండెపూడిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో, తొర్రూరు మండలం అమ్మాపురంలోని సీతారామచంద్రస్వామి ఆలయాల్లో ఇత్తడితో తయారు చేసిన వస్తువులు, ఊరేగింపు వాహనాలను అపహరించారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ శివారు, జమ్మికుంట తండాల్లోని 25కేవీ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ను చోరీ చేశారు. దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో ఓ ఇంట్లో వస్తువులు, అమ్మాపురం ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వాహనాలను అపహరించి ఆటోలో తిరిగి వెళ్తూ గురువారం పోలీసులకు చిక్కారు. తొర్రూరులోని అంబేద్కర్ సెంటర్లో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.60వేల నగదు, ఆటో, 45 కిలోల కాపర్ వైర్, గుండెపూడిలోని ఆలయానికి చెందిన సుమారు 60 కిలోల గరుడ వాహనం, 70 కిలోల అశ్వవాహనం, 40 కిలోల ఆంజనేయస్వామి విగ్రహం, 10 కిలోల ఇత్తడి గొడుగు, నాలుగు కిలోల దివిటీలు, 4 కిలోల ఇత్తడి చెంబులు, అమ్మాపురం ఆలయానికి చెందిన 40 కిలోల హనుమంతుడి వాహనం, 40 కిలోల ఇత్తడి ఆశ్వవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తొర్రూరు, మరిపెడలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సైలకు డీఎస్పీ రివార్డులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో తొర్రూరు సీఐ వై సత్యనారాయణ, తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ ఎస్సైలు జగదీశ్, రమేశ్, తహెర్బాబా, సిబ్బంది పాల్గొన్నారు.