తాడ్వాయి, డిసెంబర్ 24 : మహా జాతర సమీపిస్తున్న కొద్దీ ముందస్తు మొక్కులకు మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం సమ్మక్క-సారలమ్మను దర్శనానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల నుంచి సైతం తల్లుల సన్నిధికి చేరుకున్నారు. మొదట జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి వాగు ఒడ్డున ఉన్న జంపన్న గద్దె, నాగులమ్మ గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకొని సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు.
గద్దెల పరిసరాలతో పాటు చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో విడిది చేశారు. అలాగే రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పార్థసారథి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి అదనపు కలెక్టర్ శ్రీజ, మేడారం ఈవో రాజేంద్రం, పూజారులు ఘన స్వాగతం పలికి గద్దెల వద్దకు తీసుకెళ్లగా గిరిజన సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు. పూజారులు అమ్మవార్ల వస్ర్తాలతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట తహసీల్దార్ తోట రవీందర్ ఉన్నారు.