ఖానాపురం : అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురంకు చెందిన పులుగం రాజు(44) వృత్తిరీత్యా ఫొటో, వీడియోగ్రాఫర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రాజు గత కొంతకాలంగా మద్యానికి బానిసై పలుమార్లు భార్యతో గొడవపడుతుండేడివాడు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి మద్యం సేవించి భార్య లావణ్యతో గొడవపడ్డాడు. దీంతో లావణ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే నిద్రించింది. సోమవారం ఆమె ఇంటికి రాగా భర్త రాజు ఇంటి ముందు మెట్ల వద్ద రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉన్నాడని తెలిపారు.
రాజు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడా? లేక ఎవరైనా అతడిని కొట్టి చంపారా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.సంఘటనా స్థలాన్ని ఏసీపీలు ఫణీందర్, కరుణసాగర్ రెడ్డి, రూరల్ సీఐ సతీశ్బాబు పరిశీలించారు. రాజు మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు డాగ్స్క్వాడ్ను, క్లూస్టీంను రప్పించారు. స్థానిక పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయిబాబు వెల్లడించారు.