వర్ధన్నపేట, ఫిబ్రవరి 11 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపై నిర్మించిన సచివాలయ భవనాన్ని కూల్చేస్తామని అర్థంలేని వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించారు. హైదరాబాద్లోని శాసనసభ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ సచివాలయాన్ని నిర్మించారన్నారు. సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం దళిత, గిరిజన, బహుజనులకు ఎంతో గర్వకారణమని, దీన్ని జీర్ణించుకోలేని విపక్ష నేతలు సచివాలయాన్ని పేల్చేస్తాం, కూల్చేస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో బండి సంజయ్, ఆయన పార్టీకి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.