మహబూబాబాద్, ఆగస్టు 27: కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమెత్తారు. శనివారం ఆమె టీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందుతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బండి సంజయ్ పాదయాత్ర చేసినా.. మోకాళ్ల యాత్ర చేసినా… దొర్లుకుంటూ యాత్ర చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరని అన్నారు. బండియాత్ర ప్రజాసంగ్రామ యాత్ర కాదని, రౌడీల యాత్రని అన్నారు. హిందువులు, ముస్లింలు సమన్వయంతో నడిచిన భారతదేశంలో మత చిచ్చును బీజేపీ రాజేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు తిరగబడక ముందే విభజన హామీలైన బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్, గిరిజన యూనివర్శిటీలను కేటాయించాలని డిమాండ్ చేశారు.
కోచ్ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ కోసం స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా కేంద్రం మొండికేసిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి ఇక్కడ అగుడుపెట్టాలన్నారు. మునుగోడులో బీజేపీ పార్టీ మునుగుడేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈడీ కేసులు 150 మాత్రమేనని, బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో 5వేలకు చేరాయన్నారు. ఢిల్లీలోని ఆప్ నాయకులను బ్లాక్మెయిల్ చేసి రూ.25 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యేను కొనాలని చూస్తున్నది బీజేపీ కాదా..? అని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్న కర్ణాటకలో పింఛన్లు రూ.500 ఉంటే మా ప్రభుత్వంలో రూ.2016 ఇస్తున్నామని చెప్పారు. ప్రతి వస్తువుపై జీఎస్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ట్రిపుల్ఆర్ అని చెప్పుకునే బీజేపీకి నాలుగో ఆర్ రాజగోపాల్రెడ్డి అని భ్రమ పడుతున్నారన్నారు. ఎన్ని ఆర్లు వచ్చినా, అవి కేసీఆర్ను ఏం చేయలేరని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారని, కార్యాలయాలతో పాటు మానుకోటకు మరిన్ని వరాలు కురిపిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, పర్కాల శ్రీనివాస్రెడ్డి, కొంపెల్లి శ్రీధర్రెడ్డి, యాళ్ల మురళీధర్రెడ్డి, మూల మధుకర్రెడ్డి, ఊకంటి యాకూబ్రెడ్డి, గోగుల రాజు, ముత్యం వెంకన్న, మార్నేని వెంకన్న, రఘు, కిరణ్, హరిసింగ్, బోడ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.