నమస్తే తెలంగాణ, నెట్వర్క్, అక్టోబర్ 18 : ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టగా వారు వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఒకట్రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జనగామ పట్టణ శివారులోని యశ్వంతపూర్లో ఎల్లమ్మ తల్లిని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఆవరణలో చెట్టుకు ముడుపు కట్టి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండల కేంద్రం, శివ్వాపూర్, గోగులపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారం చేశారు.
‘మీ ఆడబిడ్డను ఆదరించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి’ అని విజ్ఞప్తి చేయగా ప్రజలు పెద్దెత్తున మద్దతు పలికారు. ఆమెకు స్థానికులు మంగళ హారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. హోటల్లో చాయ్ పెడుతూ, మార్కెట్లో చేపలు అమ్ముతూ బడే నాగజ్యోతి స్థానికులతో మమేకమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని మొగుళ్లపల్లి మండల కేంద్రం, పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారం చేశారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గడపగడపకూ తీసుకెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు కార్యకర్తలు గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట పరిధిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్నాయక్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో దాస్యం వినయ్భాస్కర్ ప్రజా ఆశీర్వాద యాత్రను కొనసాగించారు. కార్మిక సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగాయి.