‘సందట్లో సడేమియా’ అన్న చందంగా గ్యాస్ ఏజెన్సీలు నయా దందాకు తెరలేపాయి. ఈ- కేవైసీ సాకుతో అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నాయి. ఈ – కేవైసీకి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరాకు ఎలాంటి సంబంధం లేకున్నా వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు గ్యాస్ డీలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గ్యాస్ను ఒకరి పేరుమీద నుంచి మరొకరి పేరు మీదకు మారిస్తే రూ.300 చార్జి చేయాలి. కానీ, రూ.1500ల నుంచి రూ.2వేలకు వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహబూబాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఈ -కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పేరుతో గ్యాస్ ఏజెన్సీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. గ్యాస్ వినియోగదారుల ఈ- కేవైసీని పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించాయి. ఇందుకు ఎలాంటి తుది గడువును విధించకపోగా, దశల వారీగా పూర్తి చేయాలని పేర్కొన్నాయి. కాగా, ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఇందులో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా కోసం వినియోగదారుల నంబరుతోపాటు కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారనే వివరాలను దరఖాస్తులో నింపాలి. ఈ కేవైసీకి రూ.500కే గ్యాస్ సిలిండర్కు సంబంధం ఉందనుకొని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా భావించిన గ్యాస్ డీలర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వినియోగదారుల అవసరాన్ని గుర్తించిన గ్యాస్ డీలర్లు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు.
మాములుగా ఈ కేవైసీ అయితే ఉచితంగా చేస్తున్నారు. ఒకవేళ గ్యాస్ను ఒకరి పేరుమీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చినా లేదా చనిపోయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల పేరు మీద మార్చినా రూ.300 చార్జి చేయాలి. పేరు మార్పిడికి గ్యాస్ వినియోగదారుడి నంబర్, నాలుగు ఫొటోలు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా నంబర్ (ఒకవేళ మరణించిన వ్యక్తి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే డెత్ సర్టిఫికెట్) జత చేసి రూ.300 చెల్లిస్తే పేరు మార్చాలి. కానీ, ఇది లేదు.. అది లేదని కుంటి సాకులు చెబుతూ వినియోగదారుల నుంచి వేలకు వేలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వినియోగదారులు డీలర్లు అడిగినంత ముట్టజెబుతున్నారు. పేరు మార్పిడికి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు రూ.వెయ్యి, మరికొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీలు రూ.1500, రూ.1800ల నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకొని డీలర్లు దోపిడీకి పాల్పడుతున్నా ఆయిల్ సంస్థలకు చెందిన సేల్స్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఆయిల్ సంస్థలకు చెందిన అధికారులు గ్యాస్ డీలర్ల దోపిడీని అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.