ఊరూవాడ ఏకమై బీఆర్ఎస్కు జైకొడుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభం‘జనం’లా కదలివస్తూ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలతో కొండంత బలాన్నిస్తున్నది. బుధవారం అన్నిచోట్లా ప్రచారం హోరెత్తగా నియోజకవర్గాలన్నీ జనప్రవాహంతో పోటెత్తాయి. ఈ సందర్భంగా బరిలో ఉన్న క్యాండిడేట్లు కాలినడకన, బైక్లపై, రోడ్షోల ద్వారా ప్రజలను కలుస్తూ ముందుకుసాగారు. ‘అభివృద్ధి’ మంత్రం జపిస్తూ.. బీఆర్ఎస్ సరికొత్త మ్యానిఫెస్టోను వివరించారు. మోసపూరిత హామీలిచ్చే కాంగ్రెస్ నాయకులను నమ్మి గోసపడవద్దని.. అన్నింటా అభివృద్ధి చేసి అన్ని విధాలా ఆదుకునే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. ప్రచార సభల్లో గొల్లకుర్మ, ఒగ్గుడోలు, డప్పు కళాకారులు, కోలాట బృందాలు చేసిన ఆటపాటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, కొండపూర్, మల్కాపూర్, వెంకటాద్రిపేట, వెంకటేశ్వరపల్లె, తీగలతండా, రాజవరం గ్రామాల్లో ప్రచారం, ఆత్మీయ సమ్మేళనాల్లో స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనను నిండుమనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే స్టేషన్ఘన్పూర్ను అభివృద్ధిలో నంబర్వన్ చేస్తానని హామీ ఇచ్చారు.
రాయపర్తి మండలంలోని రాగన్నగూడెం, గణేశ్కుంటతండా, జేతురాంతండా, జింకురాంతండా, కేశవాపురం, ఎర్రకుంటతండా, కొలన్పల్లి, జయరాంతండా(కే), పోతిరెడ్డిపల్లి, వాంకుడోతుతండా, కిష్టాపురం, పన్యానాయక్తండాల్లో పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఊరూరా కలియదిరుగుతూ ప్రజలతో మమేకమై బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
నర్సంపేటలోని 1, 2, 3, 13, 14, 15, 16, 22వ వార్డుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. మూడు గంటల కరెంటు చాలు అని, రైతుబంధు వద్దంటున్న కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోవద్దని కోరారు. గత ఎన్నికలో ఇచ్చిన హామీలన్నింటినీ తాను నెరవేర్చాలని మరోసారి ఆశీర్వదిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల, ఎల్లారెడ్డిపల్లి, గుండ్లకర్తి, కాసులపాడు, మొట్లపల్లి, మెట్టుపల్లి, గుడిపహాడ్ గ్రామాల్లో, భూపాలపల్లి మున్సిపల్ పరిధి 8, 27వ వార్డులు జవహర్ నగర్ కాలనీ, రెవెన్యూకాలనీల్లో భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ కావాలని, నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
పర్వతగిరి మండలంలోని వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాల్పురం, గోరుగుట్టతండా, చౌటపల్లి, హట్యాతండా, దౌలత్నగర్, సీకే తండా, ఇస్లావత్ తండాల్లో వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ ప్రచారం చేశారు. రెండుసార్లు మీ బిడ్డగా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేశా.. ఈసారి కూడా నిండుమనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పులుకుర్తి గ్రామాల్లో పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ను ఒప్పించి వందల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చేర్యాల మున్సిపాలిటీ 1, 2, 3, 4, 5, 6, 11, 12వ వార్డుల్లో జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.