సుబేదారి, మార్చి 16 : నిర్దిష్ట సమయంలో చిట్ఫండ్ డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిట్ఫండ్ యజమానులను ఆదేశించారు. ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు వారి ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్లో సీపీ చిట్ఫండ్ యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిట్ఫండ్ సంస్థలపై నమోదైన కేసులు, డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసిన యజమానుల గురించి సీపీ ఆరా తీశారు. ఖాతాదారులకు చెల్లింపుల్లో ఆలస్యం చేయడానికి కారణాలను ఆయా చిట్ఫండ్ సంస్థల యజమానులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్ఫండ్ సంస్థల యజమానులు సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టిపెట్టాలని, డబ్బుల చెల్లింపు వివరాలను పోలీసు అధికారులకు అందజేయాలని, వచ్చే మంగళవారం మరోసారి సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. చిట్ఫండ్ సంస్థల వారీగా ఖాతాదారులకు చెల్లించాల్సిన వివరాలను వరంగల్ పోలీసు కమిషనరేట్ వెబ్సైట్లో ఉంటాయని, ఇకపై ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వాహకులు నడుచుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. చెల్లింపుల విషయంలో కచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు ఎంఏ బారి, మురళీధర్, అదనపు డీసీపీ పుష్పారెడ్డి, చిట్స్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి పాల్గొన్నారు.
దుగ్గొండి, మార్చి 16 : గుడుంబా విక్రయిస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చలపర్తి గ్రామానికి చెందిన మొలంగూరి మహేశ్ గ్రామంలో గుడుంబా విక్రయిస్తుండగా, పలుమార్లు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయినా మళ్లీ గుడుంబా అమ్ముతుండగా పట్టుకుని తహసీల్దార్ సంపత్కుమార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు.