హనుమకొండ చౌరస్తా, నవంబర్ 8 : హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఆపరేషన్లు చేశారని… ఆపరేషన్ వికటించడంతోనే ప్రాణాలు పోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రి వరకు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
మృతుడి కుటుం బ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన గాదం రాజయ్య(45)కు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 28న హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్కి తీసుకువచ్చారు. రాజయ్య కడుపులో పేగు మలకబడిందని వైద్యులు చెప్పి ఆపరేషన్ చేశారు. ఆరు రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో రా జయ్యను నవంబర్ 1న మళ్లీ హోప్ హాస్పిటల్కి తీసుకురాగా డాక్టర్లు పరీక్షించి మళ్లీ ఆపరేషన్ చేశారు. మీరే మీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు చెప్పారని, అయితే ఏ మాత్రం ఆరోగ్యం బాగుపడకపోవడంతో రాజయ్యకు మళ్లీ మూడోసారి నవంబర్ 4న మళ్లీ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. అయితే.. పరిస్థితి విషయమించి మంగళవారం ఉదయం 9గంటలకు రాజయ్య మృతి చెందాడని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వలనే తన భర్త చనిపోయాడని భార్య రాజక, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఇప్పటికే రూ.3లక్షలు కట్టించుకున్న ఆస్ప త్రి యాజమాన్యం.. మరో రూ.2లక్షలు కట్టని పక్షంలో మృతదేహాన్ని ఇవ్వమని చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న హనుమకొండ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని హాస్పిటల్లోనే ఉంచి రాత్రి వరకు ఆందోళన చేశారు.