ఖిలావరంగల్, ఫిబ్రవరి 1 : పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ భూమి హక్కు పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ బీ గోపి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోడు భూములు, అటవీ సంరక్షణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మొత్తం 7,711 మంది పట్టా పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో 1,471 దరఖాస్తులను తిరస్కరించామని, మిగిలిన వాటిని ఉన్నత స్థాయి కమిటీకి పంపించామని పేర్కొన్నారు. వారం, పది రోజుల్లో పాస్ పుస్తకాలు ప్రింట్ అవుతాయన్నారు. 3,486 ఎకరాల పోడు భూమికి 58 గ్రామాల నుంచి ఆర్వోఎఫ్ఆర్ దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అటవీ హకుల చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 23వ తేదీ కంటే ముందు కాస్తులో ఉన్న వారినే హకుదారులుగా గుర్తిస్తామని చెప్పారు. కాగా, ఖానాపురం మండలంలోని 9 గ్రామాలకు చెందిన పోడు రైతులు ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బత్తిని శ్రీనివాస్తో కలిసి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాస్తులో ఉన్నా కొంతమంది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి అని నోటీసులు ఇచ్చారని, 50 ఏళ్ల ముందు నుంచే సాగు చేసుకుంటున్నామని, మాకే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స, డీఎఫ్వో అర్పన, డీటీడీవో జహీరుద్దీన్, ఆర్డీవో మహేందర్జీ, నెకొండ జడ్పీటీసీ లావుడ్యా సరోజన, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.