పర్వతగిరి, జనవరి 28: పర్వతాల శివాలయం అద్భుతంగా నిర్మించారని మంత్రి హరీశ్రావు కితాబునిచ్చారు. ఆలయ పునఃప్రతిష్టాపన వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి శనివారం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడి శివాలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ఇంత గొప్ప కార్యానికి నడుం బిగించిన కల్లెడ రామ్మోహన్రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. 800 ఏళ్ల నాటి జీర్ణావస్థలో ఉన్న శివాలయాన్ని పునఃప్రతిష్టించడం గొప్ప విషయమన్నారు. జీర్ణావస్థలో ఉన్న ఒక ఆలయాన్ని పునర్నిర్మించడం అంటే 100 ఆలయాలను నిర్మించిన దానితో సమానమన్నారు. రామ్మోహన్రావు సొంత డబ్బుతో పాటు తన సమయాన్ని వెచ్చించి ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రామ్మోహన్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు కోరిక మేరకు ఈప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఆలయాల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. కొంతమంది పెదవులతో మాట్లాడితే సీఎం కేసీఆర్ హృదయంతో పనిచేస్తారని గుర్తుచేశారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కాకతీయులు కట్టిన శివాలయాలు జిల్లాలో చాలా ఉన్నాయన్నారు. రామప్ప, లక్నవరం, వేయి స్తంభాల గుడిని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. 800 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం టూరిజం హబ్గా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఆలయ పునర్నిర్మాణం, ప్రతిష్టాపన కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ పర్వతాల శివాలయం వేడుకలు ఘనంగా జరుగడం సంతోషంగా ఉందన్నారు.
పులకించిన పర్వతాల గిరి
పర్వతాల శివాలయ పునఃప్రతిష్టాపన మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామస్మరణతో పర్వతాల గిరి మార్మోగింది. ఉదయం నాలుగు గంటల నుంచి వివిధ పూజా క్యార్రమాలను గుండోజు నాగార్జునాచార్యులు, దీగోజు మహేశ్శర్మ, బాణాల సాయిశర్మ నేతృత్వంలో వేద పండితులు కన్నుల పండువలా నిర్వహించారు. భక్తులకు మహా అన్న సంతర్పణ చేశారు. శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలో కల్యాణం కనుల పండువలా సాగింది. సా యంత్రం పూర్ణాహుతితో వేడుకలు పరిసమాప్తమయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు-ఉష దంపతులు, ఎమ్మెల్యే అరూరి, ఆర్డీఎఫ్ కార్యదర్శి ఎర్రబెల్లి రామ్మోహన్రావు, మంత్రి కుమారుడు ప్రేమ్చందర్రావు దంపతులు, కుమార్తె ప్రీతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు, జనగామ జడ్పీ అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి దంపతులు శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. రెండు గంటలకు ఒకసారి 200మంది పాఠశాల విద్యార్థులతో వందేమాతరం, శివనామస్మరణతో ఆలయ ప్రాంతాలు మార్మోగాయి. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
గాయని సునీత సంగీత విభావరి..
సినీ నేపథ్య గాయని సునీత సంగీత విభావరి ఉర్రూతలూగించింది. వెంపటి శ్రావణి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అలరించింది. కార్యక్రమాల్లో చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్కుమార్, శంకర్నాయక్, తాటికొండ రాజయ్య, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, నగర మేయర్ గుండు సుధారాణి, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి, శశాంక, కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, డాక్టర్ గుండాల మదన్కుమార్, జూలపెల్లి సంపత్రావు, దైవజ్ఞశర్మ, ఆర్టీసీ డిపో మేనేజర్లు పరిమళ, బాబునాయక్, ఎస్టీఐ భవాని, సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీపీ కమల, ఎంపీటీసీ రాజు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మనోజ్కుమార్, పట్టాపురం ఏకాంతం గౌడ్, శాంతిరతన్రావు, యుగేందర్రావు, జితేందర్రెడ్డి, రంగు జనార్దన్గౌడ్, రంగు రజితాకుమార్గౌడ్, రాంచందర్రావు, చింతకుంట్ల రంజిత్, బొట్ల మధు తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడో రోజు సుమారు 50వేల మంది భక్తులు తరలివచ్చారు.