పర్వతగిరి, జనవరి 20 : పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు, నగిషీలు తయారు చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి పర్వతగిరి పర్వతాల శివాలయం మంత్రి ఎర్రబెల్లి వంశీయుల ప్ర త్యేక కృషితో పూర్వ వైభవం సంతరించుకుంటున్న ది. గతంలో పర్వతాల గుట్టకు సమీపంలో శిథిలావస్థకు చేరిన శివాలయాన్ని మంత్రి దయాకర్రావు, ఆయన బంధువు కల్లెడ వాస్తవ్యుడు, ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు ఆర్థిక తోడ్పాటుతో పునర్నిస్తున్నారు. మంత్రి సహకారంతో దేవాదాయ శాఖ నుంచి రూ.70 లక్షలు మంజూరు కాగా, సు మారు రూ.7 కోట్లను దాతల నుంచి సేకరించారు.
రాతితో పిల్లర్లు, గోడలు, భీమ్లతో ఆలయాన్ని అ ద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు. ధ్వజ స్తంభాన్ని గ్రానైట్ రాయితో ఏర్పాటు చేశారు. ఎర్రబెల్లి రా మ్మోహన్రావు ప్రత్యేకంగా భారీ గ్రానైట్ రాళ్లపై శి ల్పులతో వివిధ రకాల ఆకృతులు చెక్కించి పర్వతా ల గుట్టపైకి తీసుకొచ్చి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా మలిచారు. ఆలయం చుట్టూ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావు సహకారంతో సీసీ రోడ్లు వేశారు. చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేయించారు. పర్వతాల గుట్ట పైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా మెట్లు, ఇరుపక్కలా స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు చేశారు. గుట్ట మీదకు వెళ్లే క్రమంలో మధ్యలో సేద తీరడానికి హట్స్ను నిర్మిస్తున్నారు. గుట్ట మీద విద్యుత్, తాగు నీటి సౌకర్యం కల్పించారు. కాగా, ఆలయాన్ని పునరుద్ధరిస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిష్ఠాపన వేడుకలకు ఏర్పాట్లు..
ఈ నెల 26వ నుంచి 28వ తేదీ వరకు ఆలయ ప్రతిష్ఠాపన ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 26న గోపూజ, 108 బిందెలతో జలాభిషేకం, అంకురార్పణ, హోమాలు, 27న సుప్రభాత సేవ, కుంకుమార్చన, అష్టలక్ష్మీ పూజలు, గ్రామంలో విగ్రహామూర్తుల ఊరేగింపు నిర్వహిస్తారు. 28న రుద్ర హోమం, దేవాలయ సంస్కారం, యంత్ర స్థాపన, విగ్రహాలు, నందీశ్వర శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించనున్నారు. అలాగే, ప్రముఖ గాయకులు సునీత, మధుప్రియ, మంగ్లీతో పాటు హైదరాబాద్ రవీంద్ర భారతి నుంచి నృత్య కళా బృందాలు పాల్గొంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ధ్వజ స్తంభానికి ఆర్చరీ క్రీడాకారులు విల్లు ఎక్కుపెట్టి దీపారాధన చేసే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పారు.