వరంగల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. తొలి విడతతో జనగామ, వరంగల్ తూర్పు, మహబూబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలు నియమితులయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు గురువారం ప్రకటించారు.
జనగామకు మంత్రి టీ హరీశ్ రావు, రైతు బంధు సమితి చైర్మన్ టీ రాజయ్య, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్కు మంత్రి సత్యవతి రాథోడ్, ములుగుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, భూపాలపల్లికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ తూర్పు సెగ్మెంట్కు ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నర్సంపేటకు రాష్ట్ర నీటివనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఇల్లందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భద్రాచలం ఎమ్మెల్సీ తాతా మధు, మంథనికి ఈత శంకర్రెడ్డిని నియమించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమితులైన ఇన్చార్జిలపై ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకొని ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు.