పరకాల, ఆగస్టు 12 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందించనున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక వంద పడకల ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందనుంది. గతంలో శాయంపేట, కమలాపూర్, దామెర, నడికూడ మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాకు చెందిన చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన పలువురు ప్రజలు వైద్యం కోసం పరకాల ప్రభుత్వ దవాఖానను ఆశ్రయించేవారు. దీంతో రోగులతో నిండిపోయి అందరికీ మెరుగైన వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడేవారు. దీంతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరకాలకు వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయించారు.
పరకాలలో 30 పడకల సివిల్ ఆస్పత్రిని 100 బెడ్లతో అప్గ్రేడ్ చేస్తూ రూ. 35 కోట్లు, ప్రతి ఏటా నిర్వహణకు రూ. 7.89 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మార్చి 5, 2022న అప్పటి ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడంతో సంవత్సరంన్నర కాలంలోనే 60 శాతం మేర ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడేళ్లలో పనులు పూర్తి చేసింది.
కేసీఆర్ ముందు చూపుతోనే పరకాల ప్రాంత ప్రజల చిరకాల కోరికైన 100 పడకల ఆస్పత్రి నిర్మాణమైంది. ఉమ్మడి జిల్లాలో వరంగల్ తర్వాత వైద్యానికి పరకాల ప్రాంతం ఎంతో పేరుగాంచింది. కానీ, ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన వైద్యం అందక ప్రైవేట్కు వెళ్లే వారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో 100 పడకల దవాఖాన మంజూరైంది. త్వరలో అందుబాటులోకి రానుండడంతో ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందనుంది.
– బొచ్చు శ్యామల, 2వ వార్డు కౌన్సిలర్, పరకాల
అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక సదరు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా పనులు చేపట్టారు. లోపల రెండంతస్తుల మెట్లకు వేసిన రెయిలింగ్ ప్రారంభానికి ముందే తుప్పు పట్టింది. ప్రధాన ద్వారం పక్కనే వేసిన టైల్స్ పగిలిపోయాయి. మున్సిపాలిటీకి వెళ్లే రహదారి గేటు వద్ద వేసిన సీసీ రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. దవాఖాన ప్రారంభించిన తర్వాత నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని.. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.