పిల్లలకు కుటుంబమే మొదటి బడి.. తల్లిదండ్రులే తొలి గురువులు.. వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకం. అందుకే తల్లిదండ్రులు అన్ని విద్యా కార్యకలాపాల్లో పాల్గొనాలి. పిల్లల నమోదు, హాజరు, డ్రాపౌట్లు, పాఠశాల నిర్వహణ తీరు, పాఠశాల అభివృద్ధి కార్యకలాపాలపై హెచ్ఎం, ఉపాధ్యాయులతో రెండు నెలలకోసారి స్కూల్ మేనేజ్మెంట్(ఎస్ఎంసీ) సమావేశాలు నిర్వహిస్తారు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఈ వ్యవహారాల్లో పాలుపంచుకోరు. ఈ నేపథ్యంలో వారి ప్రాతినిధ్యం విస్తృతం చేయడం, భాగస్వామ్యం చేయడం, పాఠశాలల శ్రేయస్సు కోసం వారి గొంతుక వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీతో పాటు ప్రతి నెల 3వ శనివారం పేరెంట్ టీచర్స్ మీటింగ్(పీటీఎం) నిర్వహిస్తున్నది.
పాఠశాలల్లో అభివృద్ధి కార్యకలాపాలు, పాఠశాల నిర్వహణ, పాఠశాల పనితీరు తదితర వాటిని పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రతి రెండు నెలలకోసారి ఎస్ఎంసీ సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ కమిటీలో ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. ఇక నుంచి పాఠశాలల అభివృద్ధిలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల మూడవ శనివారం తప్పనిసరిగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు(పీటీఎం) నిర్వహిస్తున్నది.
ప్రతి నెల మూడవ శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. ఒకవేళ ఆ రోజు సెలవుంటే 4వ శనివారం నిర్వహించాలి. ప్రతి పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు తల్లిదండ్రులను సమావేశాలకు ఆహ్వానించాలి. విద్యార్థుల ప్రగతిని, వివిధ రంగాల్లో కనబరిచిన సామర్థ్యాలను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి.
ప్రాథమిక పాఠశాలలో ‘తొలిమెట్టు’ అమలుపై, మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి, ఆంగ్ల మాధ్యమ బోధనపై అవగాహన కల్పించాలి. విద్యార్థుల హాజరు పెంపు కోసం తీసుకునే చర్యలు, వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులతో చర్చించాలి. మధ్యాహ్న భోజన అమలుపై చర్చ జరుపాలి. సమావేశం జరిగే రోజు నో బ్యాగ్ డే, బాలసభ వంటి వివిధ సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, అవకాశాలు, స్కాలర్షిప్ల వంటి విషయాలను వారికి తెలియజేయాలి.
సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యా యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముందుగా హెచ్ఎం సమావేశమై పీటీఎం సమావేశాలపై ప్రణాళిక తయా రుచేసుకోవాలి. సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు 100 మంది హాజరయ్యేందుకు స్వయం సహాయ సంఘాల సభ్యు ల సహకారం తీసుకోవాలి. నెలవారీ ఎజెండా ప్రకారం చర్చ జరిపేలా చూడాలి. ప్రతి సమావేశంలో చేసిన తీర్మానాలను రిజిస్టర్లో నమోదు చేసి తదుపరి సమావేశంలో సమీక్షించాలి.
తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు, బలహీనతలు తరగతులు, విషయాల వారీగా గుర్తించి ప్రొఫైల్స్ తయారు చేయాలి. విద్యార్థుల ప్రగతిని తెలుపుతూ పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, ఇన్స్పైర్, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్స్, ఆన్లైన్ క్విజ్లు వంటి వాటి గురించి తెలియజేయాలి. విద్యార్థుల విద్యాపరమైన, సాంస్కృతిక, ఆరోగ్యం, మానసిక స్థితిగతులు, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు మొదలైన వాటి గురించి చర్చ జరపాలి. అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాలు కొన్నింటికి ప్రత్యక్షంగా హాజరుకావాలి. డీఆర్డీవో, మెప్మా, ఎస్హెచ్జీ వంటి వారి సహకారంతో సమావే శాలను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలి.