పరకాల, ఫిబ్రవరి 10: రాష్ట్రంలోని మహిళలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన 86 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, దేశానికే మార్గదర్శకంగా నిలుపుతున్నారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని తెలిపారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. గ్రామాల్లో కొందరు వ్యక్తులు రాష్టంలో అమలవుతున్న పథకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కానీ, వారు వ్యక్తిగతంగా పథకాలతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. విపక్ష పార్టీల అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధుల, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.