వరంగల్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వరని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, అకాల వర్షాలతో తడిసిన వడ్లను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎకడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతులకు మేలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏమీ చేయలేని వారు ఇక్కడ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రతిపక్షాల కుటిల నీతిని రైతులు గుర్తించాలని కోరారు. దేశంలో ఎకడా లేని విధంగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. పంట నష్టపరిహారం ఎకరాకు రూ.10 వేలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. కౌలు రైతులకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. రైతుల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని మంత్రి అన్నారు. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తున్న సమయంలో అకాల వర్షాలు పడి రైతులకు నష్టం చేశాయని చెప్పారు. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే తడిసిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఈ నెల 5న హనుమకొండ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి దయాకర్రావు తెలిపారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి ర మేశ్, ఒడితల సతీశ్కుమార్, నన్నపునేని నరేందర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్లతో మంత్రి సమీక్షించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. ఎక్కువ మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొనేలా నాయకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.