హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 8 : యాంసంగికి సంబంధించి హనుమకొండ జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. ముందస్తుగా నాట్లు వేసుకున్న రైతుల పొలాలు ఇప్పటికే కోతకు వచ్చాయి. దీంతో హార్వెస్టర్ల సాయంతో నాలుగు రోజుల నుంచి వరి కోసి ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో పడ్డారు. మరో వారం రోజుల్లో ఒక పరకాల డివిజన్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల వరి కోతలు ముమ్మరం కానున్నాయి. దీని కోసం రైతులు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ధాన్యం అరబెట్టుకునేందుకు కల్లాలను చదును చేసుకుంటున్నారు. అదేవిధంగా పట్టాలను కూడా సమకూర్చుకుంటున్నారు. మొత్తానికి వచ్చే రెండు నెలలు జిల్లాలో వడ్ల జాతర జరుగనుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. జిల్లాలో వరి పంటదే అగ్రస్థానం ఉంది.
1.40 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో ఆడ, మగ వరి సుమారు 10 వేల ఎకరాల వరకు మల్టీ నేషనల్ కంపెనీలు రైతులతో సాగు చేయిస్తున్నారు. ఇదేకాకుండా మరో 25 వేల ఎకరాల్లో ఓపెన్ పాలినేషన్(ఓపీ) రకాల విత్తనాలను కూడా పలు సీడ్ మిల్ యజమానులు బై బ్యాక్ పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. ఇక మిగిలిన వడ్లు మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయిస్తారు. దీని కోసం జిల్లాలో 154 కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేయనుంది. హార్వెస్టర్ల యజమానులు తమ మిషన్లను మైనర్ రిపేర్ ఉంటే చేయిస్తున్నారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఏజెంట్లు ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెద్ద ఎత్తున హార్వెస్టర్లను ఇక్కడి రైతుల కోసం రప్పిస్తున్నారు.అయితే అకాల వర్షాలు మాత్రం అన్నదాతలను టెన్షన్ పెడుతున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు జిల్లాలో వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. అయితే ఇప్పటివరకైతే ఈ అకాల వర్షాల వల్ల ఇతర పంటలకు నష్టం జరిగినా వరి పంటకు మాత్రం పెద్దగా నష్టం జరుగలేదు. ఇప్పుడు మాత్రం వరి చివరి దశకు చేరింది. ఈ సమయంలో ఈదురుగాలులు వచ్చినా, రాళ్లు పడినా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి కొనసాగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికైతే అటు రైస్ మిలర్లు, సీడ్ కంపెనీల యజమానులు తమ ప్లాంట్లు, మిల్లులు, గోదాములను సిద్ధం చేసుకుని ఉన్నారు. ఈ రెండు నెలల పాటు ధాన్యం తరలించే ట్రాక్టర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.