వరంగల్, ఆగస్టు 18(నమస్తేతెలంగాణ) : మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. దరఖాస్తుల స్వీకరణకు తెరపడింది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలో అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. 63 మద్యం దుకాణాలకు రెండు వేలకుపైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. 2023-25 కాల పరిమితి కోసం మద్యం దుకాణాల కేటాయింపునకు టెండర్ల ప్రక్రియ నిర్వహణకు ప్రభుత్వం ఈ నెల 2న షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 3న ఎక్సైజ్శాఖ అధికారులు లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ ప్రావీణ్య డ్రా తీశారు. జిల్లాలోని 63 మద్యం దుకాణాల్లో గౌడలకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం చొప్పున 20 షాపులు రిజర్వ్డ్ కేటగిరిలోకి వెళ్లాయి. 43 మద్యం దుకాణాలు అన్ రిజర్వ్డ్ కేటగిరిలో ఉన్నాయి. 63 మద్యం దుకాణాలకు ఈ నెల 4న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లాలోని 63 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఎక్సైజ్శాఖ అధికారులు హనుమకొండలోని తమ శాఖ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నర్సంపేట, వర్ధ్దన్నపేట, పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ కౌంటర్లలో వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆరంభంలో ఎక్సైజ్శాఖ అధికారులు ఆశించిన మేరకు దరఖాస్తులు దాఖలు కాలేదు.
దీంతో ఒక దశలో వారు జిల్లాలోని రైస్మిల్లర్లు, రియల్టర్లు, మార్కెట్ ట్రేడర్లతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రతినిధులను కలిసి మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొని దరఖాస్తులు దాఖలు చేయాలని కోరారు. చివరకు గడువు సమీపిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల దాఖలు ఊపందుకున్నది. బుధవారం వరకు 63 మద్యం దుకాణాలకు కేవలం 699 దరఖాస్తులే దాఖ లు కాగా గురువారం ఒక్కరోజే 700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. సాయంత్రం ఐదు గంటల్లోగా కౌంటర్లోకి ప్రవేశించిన వ్యాపారుల నుంచి రాత్రి వరకు అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. చివరి రోజైన శుక్రవారం వ్యాపారులు దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ల వద్ద పోటెత్తారు. క్యూలో ఉండి తమ దరఖాస్తులను దాఖలు చేశారు. సాయంత్రం 6 గంటల్లోగా దరఖాస్తులతో కౌంటర్ లోపలకు ప్రవేశించిన వ్యాపారులందరి నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ముగిసింది. 63 మద్యం దుకాణాలకు మొత్తం 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఆర్ లక్ష్మానాయక్ వెల్లడించారు. ఈ నెల 21న లాటరీ తీసి వ్యాపారులకు మద్యం దుకాణాల కేటాయింపు జరగనున్నది. వరంగల్ ఉర్సు వద్ద ఉన్న నాని గార్డెన్స్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
65 షాపులు.. 5500లకు పైగా అప్లికేషన్లు మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులు వెల్లువ
సుబేదారి : హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలోని ఖిలా వరంగల్, వరంగల్ అర్బన్, కాజీపేట, హనుమకొండ నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 65 షాపులు ఉన్నాయి. శుక్రవారం దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు కావడంతో అధిక మొత్తంలో ఆప్లికేషన్లు వచ్చాయి. హనుమకొండ సుబేదారిలోని కలెక్టరేట్ కార్యాలయంలోని సెల్లార్లో నాలుగు స్టేషన్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి, ఈ నెల 4 నుంచి ఆయా స్టేషన్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 4 నుంచి 17 వరకు 3,409 ఆప్లికేషన్లు రాగా, చివరి రోజున 2 వేల ఆఫ్లికేషన్లు వచ్చాయి. ఉదయం 10గంటల నుంచి రాత్రి వరకు దరఖాస్తుల స్వీకరించారు. సాయంత్రం 6గంటలలోపు కలెక్టరేట్ కార్యాలయ సెల్లార్లోకి వచ్చిన దరఖాస్తు దారుల నుంచి రాత్రి 9గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఎక్సైజ్, పోలీసు సిబ్బంది దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. శ్రావణమాసం శుక్రవారం మంచి రోజు కావడంతో చివరి రోజు దరఖాస్తు చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలి వచ్చారు. మహిళలు సైతం కుటుంబ సభ్యులతో కలిసి దరఖాస్తులు సమర్పించడానికి వచ్చారు. ఈసారి ఎక్కువగా యువకులే టెండర్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్ కార్యాలయం దరఖాస్తు దారులతో సందండిగా మారింది. కొందరు ముహూ ర్తం చూసుకొని దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తుల స్వీకరణను ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్ పర్యవేక్షించారు. కొత్తగా టెండర్ దాఖలు చేయడానికి వచ్చిన వారికి దరఖాస్తు ఫారం లో వివరాలను నమోదు చేయడానికి ఎక్సైజ్ సిబ్బంది అవగాహన కల్పించారు. దరఖాస్తులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వెల్లువలా దరఖాస్తులు
మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన 4వ తేదీ నుంచి 18 వరకు హనుమకొండ జిల్లాలోని 65 షాపులకు మొత్తం 5500లకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
21న అంబేద్కర్ భవన్లో డ్రా మద్యం షాపుల టెండర్లకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు. హనుమకొండ జిల్లాలోని 65 షాపులకు వచ్చిన దరఖాస్తులను ఈనెల 21న సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో దరఖాస్తుల దారుల సమక్షంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఎంపిక చేస్తారు. డ్రాలో షాపును దక్కించుకునే అదృష్టం ఎవరికి దక్కుతుందో అని దరఖాస్తు దారులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. డ్రా ఏర్పాట్లలో అబ్కారీ అధికారులు నిమగ్నమయ్యారు.