నిరంతరం నడుస్తున్న రెండు యూనిట్లు
గరిష్ఠ సామర్థ్యం మేరకు ఉత్పత్తి
రోజూ 26.4 మిలియన్ యూనిట్ల కరంటు
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్కు మించి పని..
రాష్ర్టానికే తలమానికంగా ప్రాజెక్టు
గణపురం, నవంబర్ 3: ఉమ్మడి జిల్లాకు కీర్తి కిరీటమైన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) కరంటు ఉత్పత్తిలో ఆదర్శంగా నిలుస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లోని ఈ ప్రాజెక్టులో ఉన్న రెండు యూనిట్లు గరిష్ఠ సామర్థ్యం మేరకు కరంటు ఉత్పతి చేస్తున్నాయి. కేటీపీపీలోని రెండు యూనిట్లకు అవసరమైన బొగ్గు నిరంతరం సరఫరా అవుతున్నది. రెండు యూనిట్లకు రోజూ 15వేల టన్ను ల బొగ్గు అవసరం కాగా, ఈ మేరకు నిరాటంకంగా అందుతుండడంతో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి అవుతున్నది. కేటీపీపీ మొదటి యూనిట్లో రోజూ సగటున 12 మిలియన్ యూనిట్లు, రెండో యూనిట్లో 14.4 మిలియన్ యూనిట్లు.. మొత్తంగా 26.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. రెండు యూనిట్లలో గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యం (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. కేటీపీపీలోని రెండు యూనిట్లకు కలిపి ప్రతి గంటకు 550 టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది.
500 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మొదటి యూనిట్కు గంటకు 250 టన్నుల బొగ్గు, 600 మెగావాట్ల కరంటు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండో యూనిట్కు గంటకు 300 టన్నుల బొగ్గు వినియోగం అవుతుంది. ఈ క్రమంలో గనుల నుంచి ప్లాంటుకు చేరిన బొగ్గు స్టాక్ యార్డుకు వస్తుంది. అక్కడ నిర్దేశిత పరిమా ణంలోకి మార్చి కరంటు ఉత్పత్తి యూనిట్లలో వినియో గిస్తున్నారు. కేటీపీపీలోని రెండో యూనిటైన 600 మెగావాట్ల ప్లాంట్లో కరంటు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును సరఫరా చేసేందుకు జెన్కో సంస్థ రూ.160 కోట్లతో భారీ కన్వేయర్ అడిషనల్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏసీహెచ్పీ) నిర్మించింది. దీనిద్వారా ప్లాంటు కు నిరంతరం బొగ్గు సరఫరా అవుతున్నది. అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఏసీహెచ్పీని కేటీపీపీకి తలమానికంలా మారింది.
నిరంతరం నడుస్తున్న రెండు యూనిట్లు
నిరంతరం వెలుగులు పంచుతూ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో ఉన్న ఈ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా రోజూ 26.4 మిలియన్ యూనిట్ల కరంటు ఉత్పత్తి అవుతున్నది. రెండోదశ 600 మెగావాట్ల ప్లాంట్లో కరంటు ఉత్పత్తి ఏర్పాటు చేసిన అడిషనల్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏసీహెచ్పీ) ద్వారా నిరంతరం బొగ్గు సరఫరా అవుతున్నది. రూ.160కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్లాంట్ కేటీపీపీకే తలమానికంగా నిలిచింది.