హనుమకొండ చౌరస్తా, జూలై 6 : ఆర్టీసీ వరంగల్ రీజియన్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ దందా నడుస్తోంది. తాత్కాలిక కండక్టర్ల నియామకాలు వాటికి కట్టబెట్టడంతో నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకున్నారు. ఇవి తాత్కాలిక ఉద్యోగాలైనా భవిష్యత్లో రెగ్యులర్ అవుతాయనే ఆశాభా వంతో ఉన్న నిరుద్యోగులను నమ్మించి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం ఔట్సోర్సింగ్ పద్ధతిన తాత్కాలిక కండక్టర్లను నియమించేందుకు రీజియన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో సుమారు 109 మంది కండక్టర్లను 10 ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా దశల వారీగా నియమించారు. వీరికి హకీంపేట లోని ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆ తర్వాత బస్సుల్లో టికెట్ల జారీపై మరో మూడు రోజులు అవగాహన కల్పించి టికెట్ ఇష్యూంగ్ మెషిన్స్ (టిమ్స్) ఇచ్చి విధులు అప్పగించారు. చిన్నచిన్న కారణాలతో ఆర్టీసీ యాజమాన్యం వీరిని తొల గించడంతో రూ. లక్షలు ఇచ్చిన బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కొత్తగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కండక్టర్ల భర్తీని ఆర్టీసీ యాజమాన్యం ఔట్సోర్సింగ్కు అప్పగించింది. ఏజెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మించి రూ.50 వేల నుంచి రూ. లక్షల వరకు వసూలు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండానే ఎవరు డబ్బులిస్తే వారిని తీసుకున్నారు. ఇప్పుడు తీసేయడంతో వారు మండిపడితున్నారు. ఇదంతా ఆర్టీసీ యాజమాన్యానికి తెలిసే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
డబ్బులు తీసుకుని నియమించిన ఏజెన్సీలపై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాం టి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో వారికి కూడా భాగమున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. డబ్బులు తీసుకుని అన్యాయంగా తమను తొలగించాలని, వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.