ఖానాపురం, ఫిబ్రవరి 24: గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని డీపీవో స్వరూపారాణి సూచించారు. గురువారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో పన్నుల వసూలు, పల్లెప్రగతి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా పన్నుల వసూళ్లు, నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలు, డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణను అడిగి తెలుసుకున్నారు. 60 శాతంలోపు పన్నులు వసూలు చేసిన ధర్మారావుపేట, మంగళవారిపేట, రాగంపేట, అశోక్నగర్ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో పెండింగ్ బిల్లులు లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో సేకరించి డంపింగ్ యార్డులకు తరలించిన ప్లాస్టిక్ను కొనుగోలు చేయించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని నిత్యం పర్యవేక్షించాలని కార్యదర్శులకు సూచించారు. ప్రతి ఇంటికీ ఆరు రకాల మొక్కలను పంపిణీ చేయాలని, అందుకు అవసరమైన మొక్కలనే నర్సరీల్లో పెంచాలన్నారు. నర్సరీల్లో పెరిగే మొక్కలను 80 శాతం మేర బతికించాలన్నారు. ఖానాపురం, అశోక్నగర్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై నిర్వహణ పటిష్టంగా ఉండాలన్నారు. ప్రతి కార్యదర్శి నిర్ణీత వేళలకు జీపీలకు హాజరు కావాలన్నారు. సమీక్షలో ఎంపీవో పర్వీన్ కైసర్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: నర్సరీ కేంద్రాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీపీవో స్వరూపారాణి హెచ్చరించారు. బోజేర్వు గ్రామాన్ని ఆమె సందర్శించి కాలనీల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే, నర్సరీని పరిశీలించి నిర్వహణను తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం నేరుగా జీపీ కార్యాలయానికి వెళ్లి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి కొన్ని రికార్డులను తన వెంట తీసుకెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ పిండి విజయాభిక్షపతి, ఉపసర్పంచ్ కుసుమ సతీశ్, ఇన్చార్జి కార్యదర్శి అశోక్కుమార్ పాల్గొన్నారు.