వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 23: వరంగల్ ఎంజీఎం దవాఖానలోని ఏఎంసీ మేల్ వార్డులో నాగుపాము చొరబడింది. ఆదివారం సాయంత్రం వార్డులో పాము కదలికలను శానిటేషన్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయం రోగులు, అటెండెంట్లకు తెలియడంతో ఆందోళనకు గురై భయంతో వార్డు వదిలి పరుగులు తీశారు. ఇంతలో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తన చేతి కర్రతో పామును కొట్టి చంపేశాడు. అయితే, ఉదయం నుంచి క్యాన్సర్ వార్డు ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తుండడంతో పాము బయటకు వచ్చి ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల వైద్యాధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.
ఇందులో దవాఖానల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచడంతోపాటు గ్రీనరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో వారం రోజులుగా పారిశుధ్య పనులు చేస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. పారిశుధ్య చర్యలతోపాటుగా పార్కింగ్, గ్రీనరీ ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టడంతో ప్రాణభయంతో పాము వార్డులోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా వార్డులోకి పాము చేరిన ఘటనపై రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురయ్యారు. పది రోజుల వ్యవధిలోనే రెండు పాములు ఎంజీఎం వార్డుల్లో కనిపించడంతో రోగులు, అటెండెంట్లు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాములు, క్రిమికీటకాలు ఎంజీఎంలోకి చేరకుండా శానిటేషన్ పనులను పటిష్టంగా చేపట్టాలని కోరుతున్నారు.