వరంగల్, మే 21 : వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్గా షేక్ రిజ్వాన్ బాషాను నియమిస్తూ ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్గా సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, సీహెచ్వో శ్రీనివాసరావు, పీఆర్వో ఆయూబ్ అలీ, బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్, సూపరింటెండెంట్లు షహజాదీ బేగం, రావుల ఆనంద్, సంతోష్కుమార్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రేటర్ కార్పొరేషన్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయిస్తానని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గ్రేటర్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న, చేపట్టబోయే పనుల సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా త్వరలోనే సమీక్ష నిర్వహిస్తానన్నారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని చెప్పారు.
నూతన కమిషనర్గా షేక్ రిజ్వాన్ బాషా బాధ్యతలు చేపట్టడంతో రెండు నెలల 10 రోజుల ఇన్చార్జి పాలనకు తెర పడింది. మార్చి 13న అప్పటి కమిషనర్ ప్రావీణ్య వరంగల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. కలెక్టర్తో పాటు ఇన్చార్జి కమిషనర్ (ఎఫ్ఏసీ) బాధ్యతలు ఇచ్చారు. దీనితో పాటు కుడా వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం షేక్ రిజ్వాన్ బాషా గ్రేటర్ కార్పొరేషన్కు పూర్తి స్థాయి కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే కుడా వైస్ చైర్మన్ బాధ్యతలు సైతం గ్రేటర్ కమిషనర్కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యను గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి ఆమెకు పూల మొక్కను అందజేశారు. వరంగల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు నెలలుగా ప్రావీణ్య గ్రేటర్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.