ఆస్తులు తీసుకుని తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కుమారుడు
వృద్ధురాలి గుడిసెను తొలగించి కొత్త ఇంటి నిర్మాణం
రెండు రోజులుగా అర్ధాకలితో చెట్టు కింద మగ్గుతున్న అవ్వ
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
చావే చరణ్యమంటూ రోదిస్తున్న వృద్ధురాలు
నల్లబెల్లి, మే 30 : పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఇంటి నుంచి గెంటేశాడో కుమారుడు. ఈ అమానవీయ ఘటన నల్లబెల్లి మండలంలో జరిగింది.
వృద్ధురాలి కథనం ప్రకారం.. మండలంలోని మేడెపల్లి గ్రామానికి చెందిన ముత్తోజు రాజమ్మ(68) కు ఇద్దరు కొడుకులు(ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి) ఇద్దరు కూతుళ్లు(స్వరూప, పద్మారాణి). భర్త బతికుండగానే కొడుకులు, కూతుళ్ల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపించింది. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో కుమారులకు చెరో ఎకరంఇచ్చి అర ఎకరాన్ని తన జీవనోపాధికై ఉంచుకున్నది. కాగా, గత ఏడాది పెద్ద కొడుకు వృద్ధురాలి అర ఎకరం భూమిని లాక్కొని ఆమె ఉంటున్న గుడిసెను సైతం కూల్చి వేసి ఇంటి నుంచి గెంటేశాడు. న్యాయం చేయాలని పలుమార్లు స్థానిక పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. పోలీసులు న్యాయం చేయకపోగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో కొన్నాళ్లు చిన్న బిడ్డ దగ్గర ఉన్న వృద్ధురాలు అక్కడా ఆదరణ కరువవ్వడంతో దిక్కు తోచని స్థితిలో రెండు రోజులుగా మేడెపల్లి గ్రామ సమీపంలోని ఓ చెట్టు నీడన ఉంటున్నది. ఆమె పరిస్థితిని గమనించిన కొందరు బాటసారులు పండ్లు, ఆహారం, నీటిని అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజారాం వృద్ధురాలిని పోలీసుస్టేషన్కు తరలించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులను పోలీసుస్టేషన్కు పిలిపించి విచారించనున్నట్లు తెలిపారు.