మూడేళ్లపాటు ప్రభుత్వ సహకారం
ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు
వర్ధన్నపేట, జూలై 7: ఆయిల్పాం పంట సాగు రైతు కుటుంబాలకు లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన జీవనియంత్రణ ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. జేడీఏ ఉషాదయాళ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు వరి, ఇతర వాణిజ్య పంటలను మాత్రమే సాగు చేసుకోవడం వల్ల వాతావరణం అనుకూలించకపోవడం, ధరలు అనుకున్న మేర లభించకపోవడం, కూలీలు, ఇతర ఖర్చులు అధికం కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వంట నూనె పంటల సాగుపై దృష్టి సారించి రైతులను ప్రోత్సహిస్తుదని తెలిపారు.
ప్రధానంగా ఆయిల్పాం సాగు చేసుకునేందుకు ముందుకొచ్చే రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడంతోపాటు సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తూ డ్రిప్ను కూడా అందిస్తున్నదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మూడేళ్లపాటు ఎకరానికి రూ. 30 వేల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. ప్రస్తుతం సంగెం మండలంలోని రామచంద్రాపురం నర్సరీలో మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉషాదయాళ్ మాట్లాడుతూ రైతులు ఇష్టారాజ్యంగా పంటలపై రసాయనాలు పిచికారీ చేయకుండా వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. ప్రధానంగా అధిక సాంద్రతగల పత్తిని సాగు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఏ మోహన్రావు, ఏవో రాంనర్సయ్య, హెచ్వో ఐలయ్య పాల్గొన్నారు.