వెంకటాపురం (నూగూరు), ఫిబ్రవరి 10 : రెవెన్యూ అధికారులు, సిబ్బంది మళ్లీ తమ చేతివాటం చూపిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి కొంతమంది ఒకరి భూమిని మరొకరిపై ఎక్కిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వీరభద్రవరం గ్రామానికి చెందిన తవిడిశెట్టి విజయలక్ష్మికి వారసత్వంగా సంక్రమించిన పట్టా భూమి ఉంది. వీరభద్రవరం (జెడ్)లోని 12.13 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. కాగా, భూ యజమానులు స్థానికంగా లేకపోవటంతో ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి రెవెన్యూ సిబ్బంది, గతంలో పనిచేసిన అధికారులతో కలిసి వారసత్వం పేరుతో తన పేరున మార్చుకున్నట్లు సమాచారం. కాగా, విజయలక్ష్మికి రైతుబంధు డబ్బులు ఖాతాలో పడకపోడంతో అనుమానం వచ్చి ఆన్లైన్లో పరిశీలించగా భూమి వేరొకరి పేరున ఉన్నట్లు గుర్తించింది. ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై తహసీల్దార్ సర్వర్ను వివరణ కోరగా భూ మార్పిడిపై బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.