భారీ వర్షాలు కురిసినా జరుగని నష్టం.. ఇక ముందు కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలి
తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మిషన్ భగీరథ అధికారులపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి : సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
హనుమకొండ, జూలై 14: భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో పరిస్థితులపై హనుమకొండ, జనగామ కలెక్టరేట్లలో గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ముందస్తుగా హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి వరద నివారణ చర్యలపై దిశా నిర్దేశం చేశారని తెలిపారు. జిల్లాల్లో కూడా కలెక్టర్లు, కార్పొరేషన్, ఇతర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం, ఇబ్బందులు కలుగలేదని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 70 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందిని 24గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దెబ్బతిన్న పీఆర్, ఆర్అండ్బీ రోడ్లకు తక్షణమే అంచనాలు తయారుచేసి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
వరంగల్ నగర అభివృద్ధికి ప్రణాళికలు
వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేద్దామని మంత్రి దయాకర్రావు అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న ఇండ్లకు తక్షణ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమించాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రైనేజీలను శుభ్రం చేయాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో డివిజన్కు ఒక నోడల్ ఆఫీసర్ను నియమించి, ఎక్కడా నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టేందుకు మిషన్ భగీరథ అధికారులు, సర్పంచులు, పీఆర్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల విషయంలో మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి ఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ పంటల నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. హనుమకొండలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలి
ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలి. గతంలో చిన్న చిన్న వర్షాలకే ముంపు పరిస్థితులు ఏర్పడేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అలాంటివి లేవు.
– వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
విలీన గ్రామాలకు స్మార్ట్ సిటీ నిధులివ్వాలి
విలీన గ్రామాలకు స్మార్ట్సిటీ నిధులివ్వాలి. వారం నుంచి కురుస్తున్న వర్షాల సందర్భంగా ఎలాంటి డ్యామేజ్ లేకుండా బాధ్యతగా వ్యవ హరించినందున అధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. విలీన గ్రామాల్లో పారిశుధ్య పనుల కోసం ప్రతి డివిజన్కు స్థానికంగా ఉండే మరో పది మంది సిబ్బందిని నియమించాలి. డ్యామేజైన ఇళ్ల వివరాలు సేకరించాలి.
– పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అధికారులు సహకరించారు
వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కార్పొరేషన్ అధికారులు సహకరించారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. ధ్వంసమైన రోడ్ల విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలి. చార్బౌళి, రహమత్పుర, గిర్మాజీపేట తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులు నిర్మించాలి. – వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
విలీన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జీడబ్ల్యూఎంసీలో విలీనమైన 43 గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గ్రేటర్ మున్సిపల్ కాక్పొరేషన్ అధికారులకు సమస్యలు చెప్ప గానే వెంటనే స్పందిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో ఫాగింగ్ చేయాలి. రోడ్డు వైండింగ్ లేకపోవడంతో ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన అవసరముంది. వర్షం వల్ల ఇండ్లు కూలిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి.
– వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తాగునీరు కలుషితం కాకుం డా చర్యలు తీసుకోవాలి. వ్యాధులపై గ్రామాల్లో పంచాయతీ సిబ్బందితో టాంటాం చేయించడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందు కు కరపత్రాలు ముద్రించడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. – స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య
సమన్వయంతో పనిచేస్తున్నాం
వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో ముంద స్తు చర్యలు చేపట్టాం. టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేశాం.
– తరుణ్జోషి, వరంగల్ పోలీస్ కమిషనర్
ఐదు మండలాల్లో అధిక వర్షం
హనుమకొండ జిల్లాలోని శాయంపేట, ఆత్మకూరు, ఐనవోలు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జీడబ్ల్యూఎంసీ డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాం. జిల్లాలో 43 గృహాలు పాక్షికంగా, 4 పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. వరద తగ్గిన తర్వాత సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. – రాజీవ్గాంధీ హన్మంతు, హనుమకొండ కలెక్టర్
9 చెరువులకు డ్యామేజీ
వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో అధికంగా వర్షం కురిసింది. 9 చెరువులకు చిన్ని చిన్న డ్యామేజ్లు అయ్యాయి. మైలారం రిజర్వాయర్ సగం వరకు నిండింది. పాకాలలో 3.18 టీఎంసీల నీరుంది. వర్షాలతో ఎక్కడా ఇబ్బందులు రాలేదు. – డాక్టర్ గోపి, వరంగల్ కలెక్టర్
24/7 కంట్రోల్ రూం
వర్షాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 60 ఫిర్యాదులు స్వీకరించి పరిషరించాం. టీఆర్ఎఫ్ టీం సిద్ధంగా ఉంది. నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. 323 శిథిలావస్థలో ఉన్న భవనాలను గు ర్తించి 123 తొలగించాం. మిగతావి తొలగిస్తున్నాం. భవిష్యత్లో భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. – ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ కమిషనర్
ముందస్తు చర్యలు తీసుకున్నాం
వర్షాకాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. నాలాలను డీసిల్ట్ చేశాం. ఎక్రోచ్మెంట్లను తొలగించాం. స్పెషల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తాం. పాతభవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయడంతోపాటు కొన్నింటిని కూల్చి వేశాం. సీజనల్ వ్యాధుల నివారణకు డివిజన్ల వారీగా ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. రీ టెండర్స్ విషయంలో త్వరగా చర్యలు తీసుకుంటాం. జెమిని టాకీస్ జంక్షన్ వద్ద మరమ్మతులు చేసినా, ఆర్అండ్బీ శాఖ శాశ్వతంగా రోడ్డు వేయాలి. విలీన గ్రామాలకు ఫాగింగ్ మిషన్లు పంపిస్తాం. డీఆర్ఎఫ్ టీం కూడా సిద్ధంగా ఉంది.
– వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
అధికారులంతా సమష్టిగా, సమన్వయంతో పనిచేయడంతో వల్లే ఎలాంటి నష్టం జరుగలేదు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. గతంలో వరదలు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. వాటితో స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణం కొనసాగుతున్నది. కొన్ని పనులు 90 శాతం పూర్తయ్యాయి. కొన్ని మధ్యలో ఉన్నాయి. మరికొన్ని ప్రారంభించాల్సి ఉంది. వడ్డేపల్లి, భద్రకాళి చెరువులు మత్తడి పడుతున్నా ఎప్పటికప్పుడు నాలాలు శుభ్రం చేయడం వల్ల ఎకడా ముంపు జరుగలేదు. ప్రధాన నాలాల పూడిక తీయడం వల్ల భారీ వర్షాలు కురిసినా వరద నీరు సాఫీగా పోతోంది. బంధం చెరువు సమీపంలోని గుడిసెవాసులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. కాజీపేట, నయీంనగర్ ప్రాంతాల్లో 10 ఇండ్లు కూలిపోయాయి. వారికి రిలీఫ్ ఫండ్ అందజేయాలి. రెవెన్యూ కాలనీ, ఈద్గా రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి.
–చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
పునరావాస చర్యలు చేపట్టాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
జనగామ, జూలై 14(నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే తలెత్తబోయే పరిస్థితులు, వానాకాలం సీజన్లో ఎలా వ్యవహరించాలనే దానిపై జనగామ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పర్చుకొని ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈమేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకొని జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. చీటకోడూరు రిజర్వాయర్ను సందర్శించామని, ఓవర్ఫ్లో లేకపోయినా అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్ వివరించారు. స్టేషన్ఘన్పూర్ మండలంలోని సముద్రాల వద్ద బావి కూలడంతో రహదారికి ఇబ్బందులు ఏర్పడడంతో బావిని పూడ్చడం కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అనంతరం స్టేషన్ఘన్పూర్ మండలంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి మంత్రి పర్యటించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు భాస్కర్రావు, హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీవో రంగాచారి, డీఎంహెచ్వో మహేందర్, డీఆర్డీవో రాంరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.