వరంగల్ జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆవరణలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మీడియా సెంటర్తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను ప్రారంభించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేలైన్స్, వీడియో సర్వేలైన్స్, వీడియో వ్యూయింగ్ టీంలు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంసీసీ టీంలకు డీఆర్డీవో కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల కోసం ఎనుమాముల మార్కెట్ యార్డులను సందర్శించారు.
– వరంగల్, అక్టోబర్ 12 (నమస్తేతెలంగాణ)
వరంగల్, అక్టోబర్ 12(నమస్తేతెలంగాణ) : ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డిసెంబర్ 3న జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎనుమాముల మార్కెట్ గోదాముల్లో నిర్వహించేందుకు కలెక్టర్ ప్రావీణ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని, ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూంల ఎంపిక, కౌంటింగ్కు అవసరమయ్యే గదులు, వసతులు, బారికేడ్ల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఎన్నికల విధులు కేటాయిస్తున్నారు. ఇప్పటికే పలువురికి బాధ్యతలు అప్పగించారు. కంట్రోల్ రూంలో షిప్టు పద్ధతిలో విధుల నిర్వహణకు ఇప్పటికే అధికారులు, ఉద్యోగుల నియామకం పూర్తయింది. ఎన్ఫోర్స్మెం టీంలు నమోదు చేసిన కేసులను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో ఒక కమిటీ నియమించారు. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ టీంలు స్వాధీనం చేసుకున్న డబ్బుపై సమగ్ర విచారణ జరిపి రాజకీయ ప్రమేయం లేదని తేలితే వెంటనే నగదు విడుదలకు ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది. తాజాగా పలువురు అధికారులు, ఉద్యోగులను నోడల్ అధికారులు, కోఆర్డినేషన్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీటీవో అఫ్రీన్ సిద్దిఖి పోలింగ్ వెహికిల్స్, డీఆర్డీఏ ఏపీడీ సాయిచరణ్ బ్యాలెట్ పేపర్, పోస్టు బ్యాలెట్, ఈటీబీపీఎస్, వరంగల్ ఆర్డీవో ఎం వాసుచంద్ర పోలింగ్ పర్సనల్ డేటా, పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి బాలకృష్ణ ఎన్నికల సంబంధిత అధికారుల శిక్షణ, జడ్పీ సీఈవో రాంరెడ్డి పోలింగ్ పర్సనల్ వెల్ఫేర్ నోడల్ అధికారులుగా నియమితులయ్యారు. ఎన్నికల పరిశీలకుల విజిట్స్, వసతులకూ జడ్పీ సీఈవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
ఎన్ఐసీ డీఐవో అప్పిరెడ్డి కమ్యూనికేషన్ ప్లాన్, ఈడీఎం రాజ్కుమార్ వెబ్కాస్టింగ్, ఐటీ, కంప్యూటరైజేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్షన్ మెటీరియల్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ పీడబ్ల్యూడీలు, సీనియర్ సిటిజన్స్ రిక్వైర్మెంట్, డీఆర్డీవో ఎం సంపత్రావు స్పెషల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్ల నోడల్ అధికారిగా నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నర్సింహమూర్తి, బీసీ డెవలప్మెంట్ జిల్లా అధికారి పుష్పలత, ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, సహకార శాఖ జిల్లా అధికారి సంజీవరెడ్డి, ఎస్సీ డెవలప్మెంట్ జిల్లా అధికారి భాగ్యలక్ష్మి, డీబీసీడీవో పుష్పలత, డీపీఆర్వో అయ్యుబ్ అలీ, ఆర్డీవో వాసుచంద్ర నోడల్ అధికారులుగా ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవో సాహితీమిత్ర, అడిషనల్ డీఆర్డీవో ఎన్ వసుమతి, కో ఆర్డినేషన్ అధికారులుగా వ్యవహరిస్తారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గానికి మూడేసి ఫ్లయింగ్ స్కాడ్, మూడేసి స్టాటిక్ సర్వేలైన్స్ టీములు ఏర్పడ్డాయి. వర్ధన్నపేటలో 4, వరంగల్ తూర్పులో 2, నర్సంపేటలో 2 వీడియో సర్వేలైన్స్ టీంలు, ప్రతి నియోజకవర్గానికి ఒక వీడియో వ్యూయింగ్ టీంను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ప్రతి నియోజకవర్గానికి ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ టీం(సహాయ వ్యయ పరిశీలకుల బృందం), ఒక్కో అకౌంటింగ్ టీంను ఏర్పాటు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వు లు విడుదల చేశారు. విధులు నిర్వర్తించేందుకు సహాయ వ్యయ పరిశీలకుల(ఏఈవో)ను కూడా నియమించారు.
నర్సంపేటకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, వరంగల్ తూర్పునకు అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ మానస, వర్ధన్నపేటకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగనారాయణ ఏఈవోగా నియమితులయ్యారు. అకౌంటింగ్ టీంలలో నర్సంపేటకు జూనియర్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్, వరంగల్ తూర్పునకు సీనియర్ ఇన్స్పెక్టర్ జ్యోతి, వర్ధన్నపేటకు జూనియర్ ఇన్స్పెక్టర్ సాయిరాం టీం లీడర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గంలోని అకౌంటింగ్ టీంలో ఒకరు సభ్యుడిగా నియమితులయ్యారు. వీడియో వ్యూయింగ్ టీంలలో నర్సంపేట టీం లీడర్గా ఏఈవో శ్యాం, సభ్యులుగా నవీన్, ఎన్ సంతోష్, వరంగల్ తూర్పు టీం లీడర్గా టౌన్ ప్లానిగ్ సూపర్వైజర్ సుమన, సభ్యులుగా సుజాత, అరుణ, వర్ధన్నపేట టీం లీడర్గా సీనియర్ అసిస్టెంట్ గోక శ్రావణ్కుమార్, సభ్యులుగా బాలరాజు, గిర్ర శంకర్ నియమితులయ్యారు.