జయశంకర్ భూపాలపల్లి, మే 23(నమస్తే తెలంగాణ) : మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా హరీశ్రావుతో రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. 15 రోజులుగా సుమారు 20 లారీలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఉందని, పొద్దంతా ఎండబోస్తున్నామని, రాత్రి వచ్చే వానకు తడుస్తుందని, తేమ శాతం 16, 17 ఉండాలని అధికారులు చెబుతున్నారని, రోజూ వర్షాలు పడి తడుస్తుంటే తేమ శాతం ఎలా తగ్గుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకో వడంలేదని, వర్షాలకు పక్కనే ఉన్న చెరువులోకి వడ్లు కొట్టుకుపోయేలా ఉన్నాయని, కనీసం కటింగ్తో తీసుకోమని కోరినా వినేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హరీశ్రావు జా యింట్ కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ప్రతి గింజా కొంటాం.. అని ప్రకటనలు ఇస్తున్నారు.. తడిసిన ధాన్యం కొంటామని అంటున్నారు.. కమలాపూర్లో పరిస్థితి ఏంటి.. 20 రోజులుగా వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదు’ అని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సన్నాలకు మాత్రమే బోనస్ అంటే వడ్లలో రాళ్లు ఏరేసినట్లు కాంగ్రెస్ను ఏరేసేవారని అన్నారు. సన్నాలతోపాటు దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. గుండె జబ్బుతో ఉండి 20 రోజులుగా కేంద్రం వద్ద ధాన్యాన్ని కాపాడుకుంటున్న మల్లికాంబ రైతు పరిస్థితి విని హృదయం ద్రవీభవించిందన్నారు.
కమలాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్రావు ముందు అక్కడే ఉన్న రైతు గాజె మల్లికాంబ కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘నేను మూడు ఎకరాల్లో దొడ్డు రకం వేశాను.. వరి కోసి 20 రోజులుగా ఐకేపీలోనే ఉంటున్నాయని, వడ్లు కొనేటోళ్లు లేరు’ అని వాపోయింది. దయసేసి న్యాయం చేయండి సారూ అంటూ హరీశ్రావు చేతులు పట్టుకుంది. కలెక్టర్తో మాట్లాడుతా తప్పకుండా నీ వడ్లు కొనేలా చేస్తా అని చెప్పారు.