ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది. ఇలా మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో గిరిజన రైతాంగాన్ని ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించగా, సంప్రదాయ పద్ధతుల్లో సాగుకు ఐటీడీఏ శ్రీకారం చుట్టింది.
తొలుత ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ములుగు జిల్లాలో 500 ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులను ఎంపిక చేయగా వారికి ఆసక్తి ఉన్న పంటల సాగుతో పాటు విత్తనోత్పత్తికి కసరత్తు చేస్తున్నారు. అలాగే పంట దిగుబడిని మార్కెట్లో విక్రయించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
– ఏటూరునాగారం, జనవరి 8
గిరిజన గూడేల్లో ప్రకృతి సేద్యం కోసం సర్కారు నడుం బిగించింది. ఈమేరకు ప్రతి ఐటీడీఏ పరిధిలో ఆరోగ్యకరమైన పంటలు పండించాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో 2వేల మంది రైతులను ఎంపిక చేసి ప్రకృతి ఒడిలో సాగుచేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రకృతి సేద్యం పథకం కింద వరి, మిర్చి, ఇతర పంటలు సాగు చేయాలని సంకల్పించింది.
ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో 500 ఎకరాల్లో ఈ పంటలు సాగు చేసేందుకు 500మంది రైతులను ఎంపిక చేసింది. సంప్రదాయ స్వదేశీ పద్ధతులను అవలంబిస్తూ గిరిజన రైతులు విత్తనాలను కూడా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రకృతి సేద్యం ప్రారంభించేందుకు అధికారులు ముందుగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు.
ముందుగా ఈ సేద్యంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వారు సాగు చేసే పంటల్లో ముందుగా ఒకటి, రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. తొలు త గోవిందరావుపేట మండలంలో 13, మంగపేటలో 67, తాడ్వాయిలో 64, ఏటూరునాగారంలో 36, కన్నాయిగూడెంలో 31, వాజేడులో 65, వెంకటాపురంలో 46మంది రైతులను ఎంపిక చేశారు. ఆసక్తి ఉన్న మిర్చి, వరి పంటలను సాగు చేయించనున్నారు.
ఎలాంటి ఎరువులు, పురుగు మందులను వినియోగించకుండా పంటలు ఎలా సాగు చేయాలనే అనే అంశంపై రైతులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వైపరీత్యాలను వంద శాతం చీడపీడలను తట్టుకునేలా పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుభవం కలిగిన మూడు ఎన్జీవోలను గుర్తించి ఒక్కో ఎన్జీవోకు 165 ఎకరాల చొప్పున అప్పగించి పంటలు సాగుపై పర్యవేక్షించేలా చర్యలు తీసుకోనున్నారు.
శిక్షణలో పంటల సాగు ప్రారంభం నుంచి ఏం చేయాలనే విషయాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ అధికారి ఒకరు తెలిపారు. ఆవు మూత్రం, పేడ లాంటివి పంటల సాగులో ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక భూగర్భ జలాలు గిరిజన ప్రాంతాల్లో నిండుగా ఉండడంతో నీటి కొరత లేకపోవడం ఈ పంటల సాగుకు యోగ్యం కానున్నది.
పంట సాగు చేసిన తర్వాత వచ్చే దిగుబడి నుంచి మరో ఏడాది వాటినే విత్తనాలుగా ఉపయోగించనున్నారు. ఇక రెండు సంవత్సరాల పాటు ఈ పథకం కింద సేద్యం చేసేలా ఐటీడీఏ ప్రోత్సహిస్తున్నది. రైతులు సాగు చేసే పంటల దిగుబడిని మార్కెటుకు అనుసంధానం చేయనున్నారు. దీంతో మార్కెటులో ఈ పంటలకు మంచి డిమాండ్ వచ్చిన క్రమంలో రైతులకు ఆర్థిక పరిపుష్టి కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా రైతులు సాగు చేసిన పంట నుంచి ఉత్పత్తి చేసే పంటలను విత్తనాల రూపంలో మార్కెటులో అమ్మకాలు చేపట్టి ప్రకృతి సేద్యాన్ని విస్తరింపజేయనున్నారు. మార్కెట్లో ఎరువులు, పురుగు మందుల రహిత వరి, మిర్చికి మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల సాగులో అయ్యే వ్యయం, శ్రమను పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని కూడా బేరీజు వేసుకొని సాగు నిర్విరామంగా కొనసాగే ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.