హనుమకొండ, ఏప్రిల్ 11 : ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. డాక్యుమెంటేషన్ రిజస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్లకు రూ.415.64 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం మీద గతేడాది కంటే రూ.11.21 కోట్లు ఎక్కువగా వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల్లో అత్యధికంగా వరంగల్ ఆర్వో కార్యాలయానికి 29,557 డాక్యుమెంట్ల ద్వారా రూ. 201.22 కోట్లు, అత్యల్పంగా వర్ధన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 1,594 డాక్యుమెంట్ల ద్వారా రూ.2.80 కోట్ల ఆదాయం వచ్చింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు వెంచర్లు పెరగడం, కొత్తగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సబ్రిజిస్ట్రార్ ఆఫీసును ప్రారంభించడంతో ఆదాయం పెరిగిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో అపార్ట్మెంట్, విల్లాస్ కల్చర్తో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు, కాంప్లెక్స్ నిర్మాణాల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీలతో హౌసింగ్ రుణాలు అందిస్తుండడంతో మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవే రుతున్న సమయంలో నిర్మాణ రంగం సైతం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ డాక్యు మెంట్ల సంఖ్య పెరిగి ఆదాయం కూడా పెరిగిందనే అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.