గ్రేటర్ వరంగల్లో కొత్తగా స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వరంగల్ బస్టాండ్ ఉన్న స్థలంలోనే రూ.75కోట్లతో విశాలంగా హంగులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొత్త బస్స్టేషన్ భవనం డిజైన్ ఇప్పటికే సిద్ధం కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ, కుడా అధికారులు సోమవారం బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత బస్టాండ్, చుట్టుపక్కల స్థలాలను కలిపి 2050 సంవత్సరంలో నగరంలో రవాణా అవసరాలకు అనుగుణంగా సుమారు రెండున్నర ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఐదు అంతస్తుల భవనం, 32 ప్లాట్ఫారాలు, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వసతులతో పూర్తి స్మార్ట్గా ఉండనుంది.
వరంగల్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గ్రేటర్ వరంగల్లో కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరంగల్ బస్టాండ్ ఉన్న స్థలంలోనే కొత్తగా స్మార్ట్ బస్టాండ్ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవన నిర్మాణం కోసం అధికార యంత్రాం గం చర్యలు చేపట్టింది. టీఎస్ ఆర్టీసీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) అధికారులు సంయుక్తంగా సోమవారం బస్టాండ్ నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రూ.75కోట్లతో ఆధునిక హంగులతో ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. కొత్త బస్టాండ్ భవనం డిజైన్ ఇప్పటికే సిద్ధమైంది. టీఎస్ ఆర్టీసీ, కుడా ఆధ్వర్యంలో ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతోపాటు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం భవన నిర్మాణ పనులు మొద లు కానున్నాయి. వీలైనంత త్వరగా కొత్త బస్టాండ్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం బస్టాండ్ ఉన్న స్థలంలోనే కొత్త భవనాన్ని నిర్మించనున్నందున ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో ఇప్పటిలాగే బస్సుల రాకపోకలు కొనసాగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుత డిస్రిక్ట్ బస్టాండ్, మధ్యలో రోడ్డు, సమీపంలోని ఎస్ఎన్ఎం క్లబ్ స్థలాన్ని కలిపి బస్టాండ్ను నిర్వహించనున్నారు.
విశాలంగా..
ప్రస్తుతం వరంగల్లోని బస్స్టేషన్ ఆవరణ, దీని చుట్టుపక్కల స్థలాలను కలిపి విశాలంగా కొత్త బస్టాండ్ను నిర్మించనున్నారు. ప్రస్తుత బస్స్టేషన్, మార్కెట్కు వెళ్లే రోడ్డు, మున్సిపల్ కాంప్లెక్స్ల స్థలాలను కలిపి విశాలంగా కొత్త బస్స్టేషన్ నిర్మించనున్నారు. వరంగల్ బస్స్టేషన్ పక్క నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా కాశీబుగ్గ ప్రధాన రహదారికి కలుపుతూ కొత్త రోడ్డును నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండున్నర ఎకరాల్లో కొత్త బస్టాండ్ను నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైంది. ఐదు అంతస్తులతో భవనం ఉండనుంది. బస్ స్టేషన్లో 32 బస్సు ప్లాట్ఫారంల డిజైన్ ఉన్నది. కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వసతులు ఉంటాయి.
రైలు, నియోమెట్రో..
వరంగల్ మహానగరం వేగంగా విస్తరిస్తున్నది. రోజూ వచ్చే జనాలతో ప్రధాన రోడ్లన్నీ రద్దీగా ఉంటున్నాయి. 2050లో నగర రవాణా అవసరాలకు అనుగుణంగా కొత్త బస్టాండ్ను నిర్మిస్తున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్, నగరంలో మెరుగైన రవాణా కోసం నియో మెట్రోరైలు ప్రయాణికులకు బస్సు సౌకర్యం ఉండేలా చేయనున్నారు. రైల్వేస్టేషన్లకు బస్ స్టేషన్ను అనుసంధానం చేస్తారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ మధ్యలోని ప్రధాన రోడ్డు దాటేందుకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక నిర్మాణాలను చేపట్టనున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి కాజీపేట రైల్వేస్టేషన్ వరకు నిర్మించే నియో మెట్రో మార్గం కొత్త బస్టాండ్కు అనుసంధానంగా కానున్నది.