వరంగల్ చౌరస్తా, మే 25 : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్ (ఎంఎల్) కేసుల్లో పక్కాగా చేయాల్సిన వివరాల నమోదులో సైతం అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దవాఖాన అత్యవసర (క్యాజువాలిటీ) విభాగానికి నిత్యం పదుల సంఖ్యలో మెడికో లీగల్ కేసులు వస్తుంటాయి. వీటిని నమోదు చేసిన సందర్భంలో కేసుకు సంబంధించిన సమాచారం, బాధితుడు లేదా క్షతగాత్రుడి వివరాలు, హాస్పిటల్కు చేరిన సమయంలో రోగి ఆరోగ్యస్థితి తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆస్పత్రికి వచ్చిన సమయంలో బాధితుడి పరిస్థితి, ఆందిన వైద్య సేవలు, పారా మెడికల్ పత్రాలు, కేస్షీట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కోర్టుకు పంపించాల్సి ఉంటుంది. అయితే కోర్టుకు అందించాల్సిన నివేదికలో సైతం రోగి వివరాలు పూర్తిగా నమోదు చేయడం లేదు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎంఎల్ కేసులో బాధితుడి పూర్తి పేరు, తండ్రి పేరు, శరీరంపై ఉన్న గుర్తింపు చిహ్నాలు సైతం కేస్షీట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండే అవకాశాలున్నందున బాధితుడిని పక్కాగా గుర్తించడం కోసం వీటిని పాటించాలి.
ఇవన్నీ పక్కన పెట్టి కేవలం బాధితుడి పేరు మాత్రమే రాస్తున్నారు. కేస్ షీట్ నంబర్లు, విభాగాలు, వైద్యుల వివరాలను నమోదు చేయడం లేదు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించే రిక్విసిషన్ పత్రాలపై క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ సంతకం చేయాల్సి ఉండగా, కొన్ని సందర్భాల్లో అది లేకుండానే పారా మెడికల్ విభాగానికి పంపిస్తున్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా ఘటనల్లో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని పోలీసులు వాపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం భవిష్యత్లో జరగబోయే కేసు విచారణలో భారీ మూల్యం చెల్లించేదిగా మారుతుందంటున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.