చుట్టుముట్టిన వరదల్లో చెట్ల కొమ్మలు పట్టుకొని.. ప్రాణాలు అరచేత పెట్టుకొని బతుకుతామా లేదా అన్న భయం.. ఇండ్లపైకప్పులు ఎక్కి బిక్కుబిక్కుమంటూ ముంచుకొస్తున్న ముంపులో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న ఆందోళన.. ఇలా ఊహించని భయంకర పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆశాదీపంలా నిలిచాయి.. ఏటూరు నాగారం మండలం కొండాయి, మల్యాల, మేడారంలో వరదల్లో చిక్కుకున్న 122మందిని కాపాడి వారికి పునర్జన్మనిచ్చాయి. గర్భిణులనూ ‘ఒడ్డుకు’ చేర్చి నిండు ప్రాణాలను రక్షించాయి. మునిగి ఉన్న విద్యుత్ స్తంభాలు, అడ్డుగా ఉన్న విద్యుత్వైర్లు, వరదలో కొట్టుకొస్తున్న పాములు, విషపురుగులను సైతం లెక్కచేయకుండా తమ ప్రాణాలను అడ్డుపెట్టి వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తాన్ని అందించాయి.
– ఏటూరునాగారం, ఆగస్టు 5
వర్షాకాలం సందర్భంగా ముంపు ప్రాంతాల్లో సేవలు అందించేందుకు జూలై 19న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏటూరునాగారం వచ్చాయి. ఊహించని విధంగా భారీ వర్షాలకు జంపన్నవాగు పోటెత్తి ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల, మేడారం గ్రామాలను జూలై 27, 28 తేదీల్లో నిండా ముంచింది. ఈ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి సేవలందించాయి. 23మంది సభ్యులు వరదల్లో చిక్కుకున్న 122 మందిని కాపాడారు. 639 మందిని బోట్లలో వాగులు దాటించి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. పది, పదిహేను నిమిష్లాల్లో సాయం అందకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుంచి 18మందిని కాపాడారు. మేడారంలో వచ్చిన వరదతో అనేకమంది చిక్కుకొని బిక్కుబిక్కుమంటుండగా కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగి వేగంతా సేవలందించాయి. వరదలో ఒక పైకప్పుపై ఉన్న ముగ్గురిని రక్షించేందుకు వెళ్తున్న క్రమంలో సమీపంలోనే చెట్లల్లో ఇరుక్కొని తమ ను కాపాడాలంటూ అరుస్తున్న ఎనిమిది మంది కేకలు విని హుటాహుటిన చేరుకొని కొమ్మలను తొలగించి బోట్లలో సురక్షితంగా తీసుకొచ్చారు. గోదాంలో ఇరుక్కున్న ఏడుగురిని, బంగ్లాపై ఉండి అరుస్తున్న 17మందిని, టాప్పై నిల్చొని సాయం కోసం చూస్తున్న ముగ్గురిని ఇలా మొత్తంగా 122మందిని ఎంతో సాహయం చేసి రక్షించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని లక్ష్యంతో ముందుకుసాగారు.
నిత్యావసర సరుకులను చేరవేయడంలోనూ..
కొండాయి వరద బాధితుల కోసం దాతలు ఇచ్చిన వందలాది బస్తాల బియ్యం, నిత్యావసర వస్తువులను దొడ్ల ఇవతలి నుంచి కొండాయి ఒడ్డుకు చేర్చడంలోనూ ఎన్డీఆర్ఎఫ్ సభ్యులే కీలకమయ్యారు. మంత్రులు, అధికారులు కొండాయిని సందర్శించేందుకు తోడ్పాటునందించారు. మూగజీవాలను సైతం కాపాడారు. కొండాయి, మల్యాల, ఎలిశెట్టిపల్లి గ్రామాల నుంచి పునరావాస కేంద్రాలకు సుమారు 629 మందిని బోట్ల ద్వారా చేర్చారు.
వరదలో వారధిలా..
దొడ్ల వాగు వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయి కొండాయికి దారి లేకుండా అయింది. బ్రిడ్జి కొట్టుకుపోవడం, వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో అవతలి వైపు పడి ఉన్న మృతదేహాలను స్వయంగా మోసుకొనివచ్చి దొడ్లకు చేర్చారు. ఈ బోట్ల ద్వారానే బాధితులకు ఆహారాన్ని అందించి ఆకలి తీర్చారు. వరద ముంచిన మరుసటి రోజున కూడా అధికారులు కొండాయికి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలే సహకరించాయి. సుమారు పది మంది రోగులు, గర్భిణులకు ఒడ్డుకు చేర్చారు. బోట్లలోనే క్షణాల్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ తీరికలేకుండా పనిచేశారు. బోటు నడపడంలో అత్యంత అనుభవం కలిగిన గణేశ్రెడ్డి, కొప్పర జగదీశ్ విరామం లేకుండా పనిచేసి ప్రజల మెప్పు పొందారు.
రిస్క్ చేసి కాపాడాం
తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ర్టాలకు ప్రధాన కేంద్రంగా విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం ఉంది. అక్కడినుంచి మేము ఇక్కడికి జూలై 19న వచ్చాం. పెద్ద ఎత్తున వరదలు రావడంతో బృందం సభ్యులమంతా చాకచక్యంగా పనిచేశాం. కలెక్టర్ నుంచి వరదల సమాచారం రాగానే తక్షణమే వెళ్లాం. ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగాం. చెట్లల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. పాములు తిరుగుతున్నా పట్టించుకోలేదు. వరదలకు మునిగిన ప్రదేశాలు కన్పించవు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కమాండెంట్ జహీద్ఖాన్, డిప్యూటీ కమాండెంట్ ఇస్లాం జఫ్రూల్ల ఆదేశాల మేరకు అందరం సమన్వయంతో పనిచేశాం.
– ప్రదీప్ కుమార్, టీం కమాండెంట్, పింటూ నందిని, సబ్టీం కమాండర్