బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పల్లె ప్రగతి, మిషన్ భగీరథ ఫలితాలతో ఉమ్మడి జిల్లాలోని రెండు పంచాయతీలను జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. ‘నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’కు ములుగు జిల్లా, ‘దీన్దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’కు లింగాలఘనపురం మండలం నెల్లుట్ల ఎంపికయ్యాయి. పారితోషికంగా ములుగుకు రూ.3కోట్లు, నెల్లుట్ల పంచాయతీకి రూ.50లక్షలు అందనున్నాయి.
– ములుగు, ఏప్రిల్ 7
లింగాలఘనపురం పల్లె ప్రగతిని వరించిన అవార్డు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను కార్యాచరణ ప్రకారం పూర్తి చేసిన ములుగు జిల్లా కేంద్రం ఎన్డీఎస్పీఎస్వీపీకి ఎంపికైంది. తెలంగాణలో 33వ జిల్లాగా అవతరించిన ములుగు, ఇతర జిల్లా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. 2023 నేషనల్ పంచాయతీ అవార్డుల్లో ములుగు జిల్లాకు బెస్ట్ డిస్టిక్ పంచాయతీ అవార్డు లభించింది. దేశ వ్యాప్తంగా 2021-22 అవార్డుల్లో భాగంగా తెలంగాణ నుంచి 14 విభాగాల్లో వివిధ గ్రామాలు, జిల్లాలను అవార్డులు వరించగా వీటికి నగదు పురస్కారం కింద రూ.7.15 కోట్లు దక్కాయి. ఇందులో బెస్ట్ జిల్లా పంచాయతీగా ఎంపికైన ములుగు జిల్లాకు అత్యధికంగా రూ.3కోట్ల నగదు పురస్కారం లభించింది.
అభివృద్ధికి కేరాఫ్ ములుగు జిల్లా
కేంద్రం విధించిన అన్ని నిబంధనలను పాటిస్తూ కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పచ్చదనం, పారిశుధ్యం పనులను పకడ్బందీగా నిర్వహించేలా చూశారు. మేడారం జాతరలోనూ పారిశుధ్యానికి పెద్దపీట వేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టారు. అడవుల ఖిల్లా అయిన ములుగులో ఇప్పటికే అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పాటు హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం పరిఢవిల్లుతున్నది. పల్లె ప్రగతిని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేశారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో మల్లంపల్లి పంచాయతీకి అవార్డు లభించింది. తాజాగా ములుగు జిల్లాకు స్థానం దక్కి అత్యధికంగా రూ.3కోట్ల పారితోషికం లభించడంపై ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 17న ఢిల్లీలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీపీవో వెంకయ్య ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ప్రదర్శించేందుకు జిల్లా పల్లెప్రగతి వివరాలను తెలిపే రెండు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింను జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య ఆధ్వర్యంలో రెండు రోజులుగా వివిధ గ్రామాల్లో చిత్రీకరిస్తున్నారు.
రాష్ట్రం నుంచి ఏకైక జిల్లా
జిల్లా పరిషత్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక జిల్లాగా ములుగు నిలిచింది. జిల్లాలోని 174 పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతిలో భాగంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పన, మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలను కేంద్ర అధికారులు పలుమార్లు పరిశీలించి, సంతృప్తి చెంది అవార్డుకు సిఫారసు చేశారు. ప్రతి ఊరిలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, డంప్యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, క్రీడా ప్రాంగణాలు, చెత్త తరలింపు కోసం జీపీ ట్రాక్టర్, ట్రాలీ, మొక్కల సంరక్షణకు నీటి ట్యాంకర్, చివరిమజిలీకి వైకుంఠ రథం వంటి సౌకర్యాలు, నర్సరీలు, అంతర్గత, బీటీ రోడ్లు, హరితహారం మొక్కల పెంపకం తదితరాలను చూసిన కేంద్ర బృందం అవార్డుకు ఎంపిక చేసింది.
సమృద్ధిగా తాగునీటి సరఫరాలో ఆదర్శం
సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంలో జనగామ జిల్లా లింగాలఘనపూరం మండలం నెల్లుట్ల పంచాయతీ ఆదర్శంగా నిలిచి జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఉమ్మడి జిల్లా నుంచి దీన్దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్కు నెల్లుట్ల ఎంపికవడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. గ్రామ సర్పంచ్ చిట్ల స్వరూపారాణి, పంచాయతీ కార్యదర్శి రోండ్ల శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్భగీరథ ద్వార ఇంటింటికీ సమృద్ధిగా స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో గ్రామ పంచాయతీ సఫలమైంది. గ్రామంలో 14వేలమంది జనాభా ఉండగా 1200 గృహాలున్నాయి. ఊరిలో ఇంటింటికీ తాగునీరు అందుతున్న విధానాన్ని కేంద్ర బృందం పలుమార్లు పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు రావడం తమపై బాధ్యతను మరింత పెంచిందని కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అవార్డుతో పాటు రూ.50లక్షల పారితోషికాన్ని ఈ నెల 17న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నట్లు వెల్లడించారు.
సమష్టి కృషితోనే : ఎస్. కృష్ణ ఆదిత్య, కలెక్టర్, ములుగు జిల్లా
జిల్లాలో అందరు అధికారుల సమష్టి కృషితోనే ములుగుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ప్రజలు సైతం పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని అధికారులకు సహకరించారు. పల్లె ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ నిరంతరం పర్యవేక్షించాం. జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.
పల్లె ప్రగతి వల్లే అవార్డు : కొండా వెంకయ్య, డీపీవో, ములుగు జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయి. మారుమూల గ్రామాల్లోనూ మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. కలెక్టర్ సూచనల మేరకు సిబ్బంది సమష్టిగా కృషి చేయడం వల్లే అవార్డు వచ్చింది. అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ములుగు జిల్లాకు దేశ వ్యాప్తంగా పేరు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి వల్లే ములుగు జిల్లా అవార్డు దక్కించుకుంది.
జాతీయ స్థాయిలో నెల్లుట్ల పేరు : చిట్ల స్వరూపారాణి, సర్పంచ్
జాతీయ స్థాయిలో నెల్లుట్ల పేరు నిలువడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే మా ఊరికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. గ్రామస్తులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది సమష్టిగా ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేసుకు న్నాం. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది.